టార్గెట్ విజయకాంత్: మారిన సిఎం జయలలిత గురి
రాజకీయ ఆరోపణలను జయలలిత సాధారణంగానే ఛాలెంజింగ్గా తీసుకోరని అంటుంటారు. తనపై ఆరోపణలను గుప్పించే వారిపై చర్యలకు ఆమె ఏమాత్రం వెనుకాడరట. అందుకు గతంలో కరుణానిధిని పోలీసులను పురమాయించి రాత్రి పూట అరెస్టు చేయించడమే మంచి నిదర్శమనమంటున్నారు. అలాంటి జయలలిత విజయకాంత్ ఆధ్వర్యంలోని డిఎండికె క్రమంగా పుంజుకోవడం జీర్ణించుకోలేక పోతున్నారట.
ఇన్నాళ్లు కరుణానిధిపై తన ప్రతాపం చూపించిన జయలలిత ఇప్పుడు విజయకాంత్ పైన చూపిస్తోందని అంటున్నారు. గత సాధారణ ఎన్నికలలో విజయకాంత్ ఆధ్వర్యంలోని డిఎండికె, జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడిఎంకే పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. అయితే ఆ తర్వాత తాను ప్రతిపక్షంగా ఉంటానని చెప్పి విజయకాంత్ అన్నాడిఎంకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయమై వెనక్కి వెళ్లారు.
అప్పటి నుండి విజయకాంత్ జయ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. జయ సచివాలయం నుండి కాకుండా గెస్ట్ హౌస్ నుండి పరిపాలన సాగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకముందు ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే అక్కడి నుండి పరిపాలన చేసేవారని, జయ మాత్రం గెస్టు హౌస్ నుండి పరిపాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జయ అసెంబ్లీలోనే విజయకాంత్ను కడిగి పారేశారు. అంత వరకు ఓకే. కానీ ఆమె ఆ తర్వాత దీనిపై కేసు పెట్టారు. కామెంట్ చేసినందుకు విజయకాంత్ పైన, ప్రచురించిన పత్రిక పైన, విలేకరి పైన కేసు పెట్టారు.
ఆ తర్వాత ఇసుక మాఫియా చేతిలో సామాన్యుడి చితికి పోతున్నాడని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జయ హయంలో ఐదు లీటర్ల కిరోసన్ కూడా పేదవారు పొందలేక పోతున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు తనను, తన ప్రభుత్వాన్ని అవమానించే విధంగా ఉన్నాయని అన్నాడిఎంకే కేసు పెట్టిందట. వీటిని న్యాయస్థానాలు విచారణకు కూడా స్వీకరించాట. మొత్తానికి జయలలిత డిఎంకే పార్టీ పని అయిపోయినట్లుగా భావించి తాజాగా విజయకాంత్ను తొక్కేయాలని చూస్తున్నారని అంటున్నారు.