ఇలా మరింత ప్రాణనష్టం తప్పింది, స్పీడ్ బోట్ ఉంటే: కళ్ల ముందే భర్తను కోల్పోయిన మహిళ బాధ
కృష్ణా జిల్లా పవిత్ర సంగమం వద్ద ప్రమాదానికి గురైన బోటులో బాధితులంతా ఒంగోలుకు చెందినవారు కావడంతో ఒంగోలులో విషాధ ఛాయలు అలముకున్నాయి. బంధువులు, స్నేహితులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
విజయవాడ: కృష్ణా జిల్లా పవిత్ర సంగమం వద్ద ప్రమాదానికి గురైన బోటులో బాధితులంతా ఒంగోలుకు చెందినవారు కావడంతో ఒంగోలులో విషాధ ఛాయలు అలముకున్నాయి. బంధువులు, స్నేహితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒంగోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విహార యాత్రకు వెళ్ళిన వారంతా పడవ ప్రమాదంలో చిక్కుకున్నారు.
Recommended Video
చదవండి: ప్రమాదంపై జగన్, మీకు చేతకాకుంటే మేమొచ్చాం: ఊగిపోయిన వైసిపి నేత, తొలుత స్పందించింది వారే
ఆదివారం ఉదయం 2 బస్సుల్లో వీరు బయలుదేరారు. ఒంగోలుతో పాటు నెల్లూరుకు చెందిన వారు రెండు బస్సుల్లో సుమారు 62 మంది బయలుదేరారు. కుటుంబ సభ్యులతో బయలుదేరిన వారి విహార యాత్ర విషాదంగా మారింది. ఇందులో దాదాపు ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్, వ్యాపారులే ఉంటారు.
చదవండి: ఇసుకదిబ్బని ఢీకొట్టి, లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వక: బోటు ప్రమాదానికి కారణాలివీ!
వారే కాపాడకుంటే మరింత ప్రాణనష్టం
ప్రమాదం జరిగిన అరగంట, గంట తర్వాత రెస్క్యూ టీం అక్కడకు వచ్చింది. కానీ అంతలోపే స్థానిక మత్స్యకారులు పదిపదిహేను మందిని కాపాడారు. వారే కనుక వెంటనే స్పందించకపోయి ఉంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేది.
తీర ప్రాంతానికి సమీపంలో జరిగింది, లేదంటే మరింత నష్టం
బోటు తీర ప్రాంతానికి కొంచెం సమీపంలోకి వచ్చిన తర్వాత ప్రమాదం జరిగింది. మధ్యలో కనుక జరిగి ఉంటే ఊహించడానికే భయంకరంగా ఉంది. తీరానికి దగ్గరలో ప్రమాదం జరిగింది. అప్పటికే 16 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దూరంగా జరిగి ఉంటే అని బతికి భయటపడ్డ వారు ఊహించుకోవడానికే భయపడుతున్నారు. పరిమితికి మించి బోటులో ఎక్కించుకోవడం ప్రమాదానికి మరో ముఖ్య కారణం. పడవలో సరైన రక్షణ చర్యలు లేవు.
ఇసుక మేటలు గుద్దుకోవడంతో
బోటు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఆయన లైప్ జాకెట్లు ఇచ్చేందుకు కూడా నిరాకరించాడు. అంతేకాదు, ప్రమాదానికి ముందు రెండుమూడుసార్లు కుదుపులకు లోనయింది. ఆ తర్వాత ఇసుక మేటను ఢీకొట్టింది. దీంతో ప్రయాణీకులు అందరూ ఒక వైపు వచ్చారు. దీంతో మునిగిపోయిందని తెలుస్తోంది.
బోటు కింద ఇరుక్కొని ఊపిరాడక చనిపోయారు
ప్రమాదం జరిగిన చోటకు దాదాపు అరగంట, గంట దాకా రెస్క్యూ టీం లేదా అంబులెన్సులు రాలేదు. మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా కారణమని చెబుతున్నారు. బోటు తిరగబడటంతో దాని కింద ఇరుక్కుపోయి నలుగురైదుగురు ఊపిరి ఆడక చనిపోయారు.
పట్టిసీమ నీళ్ల ప్రవాహం
కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు కలిసే చోటు పవిత్ర సంగమం. పై నుంచి పట్టిసీమ నీళ్లు వేగంగా వస్తున్నాయి. వరద ఉధృతి కూడా బోటు తిరగబడేందుకు కారణంగా తెలుస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా
ప్రమాదానికి గురైన బోటుకు చెందిన కంపెనీకి ప్రభుత్వ అనుమతి లేదు. బోటుకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ వారు నిబంధనలకు విరుద్ధంగా వారిని బోటులో ఎక్కించుకున్నారు.
స్పీడ్ బోటు ఉండి ఉంటే
స్పీడ్ బోటు ఉండి ఉంటే ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది చనిపోయేవారు కాదని స్విమ్మర్లు అంటున్నారని వైసీపీ నేత పార్థసారథి అన్నారు. స్విమ్మరే వెళ్లి గొడ్డలి, సుత్తి తెప్పించుకొని బోటుకు రందం చేయడంతో ఇద్దరు, ముగ్గురు ప్రాణాలతో బతికారన్నారు.
కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోయాడు
ఓ మహిళను ఎన్డీఆర్ఎఫ్ దళాలు కాపాడాయి. అయితే, ఆమె భర్త మాత్రం ఆమె కళ్లముందే ప్రాణాలు కోల్పోయాడు. ఆమెతో ఓ ఛానల్ ప్రతినిధి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆమె మాట్లాడే పరిస్థితిలో లేరు. ఆ తర్వాత కంటతడి పెడుతూ ప్రమాదం గురించి స్పందించారు. భవానీ ద్వీపం వద్ద బోటు ఎక్కామని, బయల్దేరిన కాసేపటికే ఘోరం జరిగిపోయిందన్నారు.