అలిపిరిలో బాబుపై దాడి: 3గురు దోషులు వీరే (పిక్చర్స్)
తిరుపతి: అలిపిరి వద్ద నారా చంద్రబాబు నాయుడు పైన దాడి కేసులో ముగ్గురిని తిరుపతి అదనపు సెషన్స్ కోర్టు గురువారం దోషులుగా నిర్ధారించింది. ఈ కేసు పదకొండేళ్లుగా సాగింది. రామ్మోహన్ రెడ్డి, నరసింహా రెడ్డి, మాలచంద్రలను కోర్టు దోషులుగా నిర్ధారించింది.
వారికి మధ్యాహ్నం శిక్షను ఖరారు చేసింది. దోషులకు నాలుగేళ్ల శిక్ష, రూ.500 జరిమానా విధించిన విషయం తెలిసిందే. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 2003 అక్టోబర్ 1న ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుమలకు వెళుతున్న అప్పటి ముఖ్యమంత్రి నారా చంబ్రాబు నాయుడుపై అలిపిరి వద్ద రెండవ ఘాట్ రోడ్డులో క్లైమోర్ మైన్స్తో హత్యాయత్నం జరిగింది.
దాడికి పాల్పడినవారిలో మరో ముగ్గురికి నాలుగేళ్లు జైలు, ఒక్కొక్కరికి 500 రూపాయలు జరిమానా విధిస్తూ తిరుపతి అడిషినల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎన్ వి నాగేశ్వరరావు గురువారం తీర్పు వెలువరించారు.
33 మంది దోషులు..
2003 అక్టోబర్ 1న చంద్రబాబు నాయుడుపై జరిగిన హత్యాయత్నం కేసులో 33 మందిని దోషులుగా అప్పట్లో పోలీసులు నిర్ధారించారు. ఇందులో 11 మంది మృతి చెందగా 14 పరారీలో ఉన్నారు.
ముగ్గురికి శిక్ష ఖరారు
మరో ఎనిమిది మందిలో 19వ నిందితుడు రామ్మోహన్రెడ్డి, 22వ నిందితుడు నర్సింహారెడ్డి, 23వ నిందితుడు చంద్ర అలియాస్ కేశవ్లను పోలీసులు అరెస్టు చేసి గురువారం న్యాయస్థానం ముందుంచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దోషులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
గతంలో నలుగురికి..
పట్టుబడ్డ నలుగురికి సంబంధించి 2011లో న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో గంగిరెడ్డి, సాగర్ నిర్దోషులుగా న్యాయస్థానం విడుదల చేసింది. మరో ఇద్దరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
అక్టోబర్ 1వ తేదీన..
ఎనిమిది మందిలో పట్టుబడ్డ జనార్దన్కు సంబంధించి అక్టోబర్ 1న న్యాయస్థానంలో విచారణకు రానుంది. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరినప్పుడు ఇలా..