ఆస్పత్రిలో కలకలం: సూపరింటెండెంట్కు హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చే యత్నం
కడప: ఆ వైద్యులు తమ బాధ్యతలను మరిచి ఇష్టారీతిన వ్యవహరించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అంతేగాక, ఓ వైద్యుడు ఆస్పత్రి సూపరింటెండెంట్కు హెచ్ఐవీ రోగి నుంచి సేకరించిన రక్తంతో ఉన్న సిరంజిని గుచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో సూపరింటెండెంట్కి సిరంజి గుచ్చుకోకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీప్రసాద్పై ఇదే ఆసుపత్రిలోని ఎముకల వైద్యుడు డాక్టర్ డేవిడ్రాజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
'విధులకు సక్రమంగా హాజరవుతున్నా ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది నా మాట వినటంలేదు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటంలేదు. నేను చికిత్స అందిస్తున్న రోగిని.. నాకు తెలియకుండానే డిశ్ఛార్జి చేశారు. ఈ ఘటనలతో ఒత్తిడికి గురై భయపెట్టటానికి ఈ విధంగా చేశా' అని డేవిడ్రాజ్ అధికారులకు వివరణ ఇచ్చారు.
ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఓ హెచ్ఐవీ రోగి ఇచ్చిన సూది గుచ్చుకోవడంతో తనకు కూడా హెచ్ఐవీ సోకుతుందేమోనని ఆందోళన చెందానని తెలిపాడు. బైపాస్ సర్జరీ కారణంగానే తాను నిత్యం ఎంతో ఇబ్బంది పడుతున్నానని, ఈ బాధ తెలియాలనే ఉద్దేశంతోనే హెచ్ఐవీ సిరంజీతో సూపరింటెండెంట్ పై దాడికి యత్నించినట్లు డేవిడ్ రాజు తెలిపారు.
ఈ ఘటనపై డీసీహెచ్ఎస్ డాక్టర్ జయరాజన్ విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. డేవిడ్రాజును దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ఇదే ఆసుపత్రిలోని హెచ్ఐవీ వార్డులో ఉన్న ఓ రోగి నుంచి డేవిడ్రాజు అనుమతి లేకుండా సిరంజితో రక్తం సేకరించినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డేవిడ్ రాజుపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.