సర్ప్రైజ్ అంటూ ఆంటీకి ఫోన్.: చెన్నైలో తెలుగు టెక్కీ ఆత్మహత్య, ఇష్టంలేని పెళ్లే కారణమా?
చెన్నై: 'సర్ప్రైజ్ ఇస్తా' అంటూ ఇంట్లో వారికి చెప్పి ఓ తెలుగు ఐటీ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింంది. ఈ విషాద ఘటన సోమవారం చెన్నైలో చోటుచేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ఇష్టం లేని వివాహమే కారణంగా తెలుస్తోంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రియాంక(27) చైన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది. ఇంట్లోవారు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. జూన్ నెలలో ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4.45 లకు ఆమె దొరైపాక్కం ప్రాంతంలోని భవనం తొమ్మిదో అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ దృశ్యాలు అక్కడి సీసీకెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే ఆమె సహోద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఘటనకు ముందు ఆమె తన బంధువు(అత్త)కు ఫోన్ చేసి 'మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తా' అని చెప్పడం గమనార్హం.
ఆ వివాహం చేసుకోవడం ఇష్టం లేని కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని చెప్పారు. పోస్ట్ మార్టం అనంతరం ఈ దర్యాప్తును కొసాగిస్తామని, చెప్పారు. ఆమెకు సంబంధించిన కంప్యూటర్, ఫోన్ కాల్స్ పరిశీలిస్తున్నామని చెప్పారు.