ఏపీ మంత్రివర్గం భేటీ ఖరార్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై: తండ్రీకొడుకు దూరం..!!
Array
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి రెండోవారంలో అసెంబ్లీ సమావేశం కానుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలపై ఆమోదం తెలుపుతుంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్నందున- ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వార్షిక రాబడి, ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.
8న కేబినెట్..
సమావేశాల ఆరంభానికి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమౌతుంది. ఫిబ్రవరి 8వ తేదీన మంత్రివర్గం భేటీ కానుంది. సభలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బిల్లులపై చర్చిస్తుంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదిస్తుంది. కొన్ని కీలక తీర్మానాలకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. శాసన మండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేయాల్సిన ప్రసంగ పాఠాన్ని మంత్రివర్గం ఆమోదిస్తుంది.
ప్రాధాన్యత రంగాలకు..
వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. వార్షిక బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం 2.50 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ధారించే అవకాశం ఉందని సమాచారం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు బడ్జెట్లో అధిక కేటాయింపులు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన.. వంటి పథకాలను అమలు చేస్తోన్నందున విద్యారంగానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది.
వికేంద్రీకరణ బిల్లు లాంఛనమే?
అన్నింటికి మించి- మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు చెబుతున్నారు. దీనికి అసవరమైన ప్రక్రియను అధికారులు ఇదివరకే చేపట్టారు. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ బిల్లు సభామోదం పొందితే.. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని వైఎస్ జగన్ పరిపాలనను సాగించడం లాంఛనప్రాయమే అవుతుంది.
రేపే.. విచారణ..
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకు జారీ చేసిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిన నేపథ్యంలో మూడు రాజధానుల ప్రక్రియ మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం మరోసారి ఈ పిటీషన్లు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానున్నాయి. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని నిర్ధారించడానికి కోర్టులు- టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు కావంటూ ఇదివరకు న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
త్వరలో గవర్నర్ తో భేటీ..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో- వైఎస్ జగన్ త్వరలోనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలుసుకునే అవకాశం ఉంది. శాసన మండలి, శాసనసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించాల్సిన ఉన్న నేపథ్యంలో- మర్యాదపూరకంగా గవర్నర్ ను కలుసుకుంటారు జగన్. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని ఆహ్వానిస్తారని చెబుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై గవర్నర్ కార్యాలయం ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తుందని సమాచారం.
వారిద్దరూ దూరం..
కాగా- కీలకమైన ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హాజరు కాలేకపోవచ్చు. తాను ముఖ్యమంత్రిని అయిన తరువాతే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ ఆయన గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఇక శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు నారా లోకేష్ కూడా ఈ భేటీకి హాజరు కావట్లేదు. ప్రస్తుతం ఆయన పాదయాత్రలో ఉన్నందున మండలి భేటీకి దూరం అయినట్టే.
పాకిస్తాన్లో నరమేథం: మసీదులో ప్రార్థనల వేళ: అంతకంతకూ మృతుల సంఖ్య..!!