గ్రీన్ సిగ్నల్ : నెల్లూరులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు కుదిరిన ఒప్పందం
అమరావతి: రాష్ట్రంలోని పలు కొత్త విమానాశ్రాయాలను నిర్మించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం నిర్మించేందుకు ఎస్సీఎల్ టర్బోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు కన్సోర్టియం ఎండీ వంకాయపాటి ఉమేష్ మానవవనరులు, పెట్టుబడులు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ వెంకటేశ్వర్లు ఒప్పందంపై సంతకాలు చేశారు.
నెల్లూరు పట్టణం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో దగదర్తి విమానాశ్రయం ఉంటుంది. ఇక 2020 నుంచి అధికారికంగా విమానాలు రాకపోకలు సాగిస్తాయని సంస్థ తెలిపింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం కానున్న ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం 1,352 ఎకరాల అవసరం అవుతుందని దీని నిర్మాణ ఖర్చు రూ. 368 కోట్లుగా అంచనా వేసింది. నిర్మాణం పూర్తయ్యాక ఈ విమానాశ్రయంలో ఏడాదికి 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుందని సంస్థ తెలిపింది.
నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటు నిర్ణయం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరుగగా ఆయన మరణం తర్వాత కుంటున పడింది. గతేడాదే విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది.