APSRTC దసరా స్పెషల్-విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు-ఈసారి ఊరట అదే..
ఈ ఏడాది దసరా సీజన్ కు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులతో సిద్ధమైంది. ఈ సీజన్ లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో మరో ప్రత్యేక ఆఫర్ కూడా ఇచ్చేసింది. ఈసారి విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల వివరాలను ఏపీఎస్ఆర్టీసీ ఇవాళ ప్రకటించింది.
ఈ ఏడాది ఎప్పటిలాగే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు జరగబోతున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా తగ్గిన రద్దీ ఈసారి పెరగబోతోంది. దీంతో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి వస్తారని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఈ నెల 29నుంచి వచ్చేనెల 10వ తేదీ వరకూ ఈ ప్రత్యేక బస్సుల్ని అందుబాటులో ఉంచుతోంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ప్రకటించింది.
హైదరాబాద్, రాజమండ్రి, విశాఖ, తిరుపతి, బెంగళూరు, భద్రాచలం, చెన్నైతో పాటు ఇతర ప్రాంతాలకు కలిపి 1081 ప్రత్యేక సర్వీసుల్ని ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. వీటిలో స్పెషల్ ఛార్జీలు మాత్రం వసూలు చేయడం లేదని కూడా ఆర్టీసీ తెలిపింది. అంటే సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఈ స్పెషల్ బస్సులకు ఆదరణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.\