కల్వకుర్తికి రీపోలింగ్: శోభ గెలిచిన ఆళ్లగడ్డకి ఉపఎన్నిక
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో ఈవిఎం పని చేయడం లేదని జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ స్పందించారు. ఈ నివేదిక ఆధారంగా కల్వకుర్తిలో రీపోలింగ్ నిర్వహించాలని సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని 119వ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ఫలితం పూర్తి చూయించకుండా మొరాయించడంతో ఈసి ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, కల్వకుర్తిలో నియోజకవర్గంలో మొదట 21 రౌండ్ల వరకు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, టిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ మధ్య కొనసాగింది. ఆ తర్వాత జరిగిన ఓట్ల లెక్కింపులో టిఆర్ఎస్ అభ్యర్థి రెండవ స్థానం నుండి మూడు, నాలుగు స్థానాలకు దిగజారడంతో బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి రెండవ స్థానంలోకి వచ్చారు. మొత్తం 34 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేశారు. 25-32 రౌండ్ల వరకు వంశీచంద్కంటే ఆచారి ముందంజలో ఉన్నారు. 33, 34 రౌండ్లలో ఆచారికి 42197 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి 42289 ఓట్లు వచ్చాయి.
32 ఓట్లతో పాటు 125 పోస్టల్ బ్యాలెట్లతో 157 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. కాగా ఓట్ల లెక్కింపులో వెల్దండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన 119వ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ఫలితం పూర్తి చూయించకుండా ముందుగా మొరాయించడంతో 34 రౌండ్లు ముగిసిన తర్వాత తిరిగి అధికారులు లెక్కించారు. ఈ యంత్రంలో 727 ఓట్లు పోల్ కాగా, కేవలం బిజెపికి 17, బిఎస్పీకి 1, టిఆర్ఎస్ 33, కాంగ్రెస్ 18, వైయస్సార్ కాంగ్రెస్ 22, స్వతంత్ర అభ్యర్థికి 3 చొప్పున 119 ఓట్లు మాత్రమే చూయించడంతో ఫలితాన్ని నిలిపివేశారు. అధికారులు ఈవిఎం నిపుణులను తీసుకొచ్చి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఆళ్ళగడ్డకు ఉప ఎన్నిక
కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అంశంపై కూడా సిఈసికి లేఖ రాసినట్లు భన్వర్ లాల్ తెలిపారు. ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన దివంగత నేత శోభానాగి రెడ్డి విజయం సాధించారు. శాసనసభ ఎన్నికలకు ముందు రోడ్డు ప్రమాదంలో శోభానాగి రెడ్డి తీవ్రగాయాలపాలై మృతి చెందారు. అయితే ఎన్నికల్లో శోభానాగి రెడ్డి పోటీలో ఉంటుందని, ఒకవేళ ఆమె గెలిస్తే ఆ నియోజకవర్గానికి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఈసి అప్పుడే ప్రకటించింది.