అమరావతిలో అసైన్డ్ భూమికి బదులుగా ఇచ్చిన ప్లాట్లు రద్దు... షాక్ ఇచ్చిన వైసీపీ సర్కార్
ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని విషయంలో సూచనప్రాయంగా మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని ఏపీ అసెంబ్లీలో ప్రకటన చేసిన నేపథ్యంలో రాజధాని రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేడు అమరావతిలో బంద్ కొనసాగుతున్న పరిస్థితులలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఇదే సమయంలో రాజధాని అమరావతి లోని భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
నేడు అమరావతి బంద్: మూడు రాజధానుల ప్రకటనతో భగ్గుమన్న రైతుల నిరాహార దీక్షలు
అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం
రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ 1977 చట్టం ప్రకారం చట్టవిరుద్ధమైన పని. అసైన్డ్ భూములను సేకరించి వాటికి బదులుగా ప్లాట్లు కేటాయించడం కూడా నిబంధనలకు విరుద్ధమైన పని. ఇక ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు చెక్ పెట్టింది జగన్ సర్కార్ .
దళితులు, పేదల నుండి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల కోనుగోలు
గత టిడిపి ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ కింద సి ఆర్ డి ఎ అసైన్డ్ భూములను సేకరించి వాటికి బదులుగా ప్లాట్లను ఇచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ చట్టం 2015 ప్రకారం రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములలో చాలావరకు అసైన్డ్ భూములు ఉన్నాయి. దళితులు, పేదలకు గతంలో మంజూరు చేసిన అసైన్డ్ భూములను రాజకీయ నేతలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి, సీఆర్డీఏ కు వాటిని భూసేకరణ కోసం ఇచ్చి దానిద్వారా ఆ భూమికి బదులుగా వాణిజ్య, నివాస స్థలాలను తీసుకున్నారు.
అక్రమమని గుర్తించే సిఆర్డిఏ ఫ్లాట్ల రద్దు ... మంత్రిమండలి తీర్మానం
అయితే ఇది అక్రమమని భావించిన, నిబంధనలకు విరుద్ధమని భావించినప్పుడు సర్కార్ సిఆర్డిఏ కేటాయించిన ఫ్లాట్ లను రద్దు చేసింది. ల్యాండ్ పూలింగ్ కింద మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి తీసుకుంటే 500 గజాల నివాస స్థలం, 50 గజాల వాణిజ్య స్థలం ఇచ్చారు. ఇక జరీబు భూములకైతే 500 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అసైన్డ్ ప్లాట్ల కేటాయింపులు రద్దు చేయాలని ఇటీవల మంత్రిమండలి తీర్మానించింది.
అసైన్డ్ భూములను తిరిగి హక్కుదారులకే ఇవ్వాలని నిర్ణయం
ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అంతే కాకుండా ఆ అసైన్డ్ భూములను తిరిగి అసలు హక్కుదారులకే ఇచ్చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా వారికి ఇవ్వాలనుకున్న రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. 1977 అసైన్డ్ భూముల చట్టం ప్రకారం భూముల బదలాయింపు కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అసైన్డ్ భూముల కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్
దీంతో అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లు అయింది. టీడీపీ హయాంలో రాజధాని పేరిట ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాజధాని ప్రాంతంలో ఆ పార్టీకి చెందిన నేతలు 4,070 ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని, దాన్ని రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి, ప్రభుత్వం నుంచి రిటర్నబుల్ ప్లాట్ల రూపంలో లబ్దిపొందేందుకు ప్రయత్నించారని వైసీపీ ఆరోపిస్తోంది. అందుకే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.