రామాయపట్నం పోర్టుపై జగన్ సర్కార్ కు షాక్ .. ఆ పని మా పరిధిలో లేదని తేల్చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది . రామాయపట్నం పోర్టు పై పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసింది. రామాయపట్నం పోర్టు నిర్మాణం పై రాజ్యసభలో బీజేపీ ఎంపీ టిజి వెంకటేష్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రం రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి ఎలాంటి సహాయం చేయలేమని తేల్చి చెప్పింది.

బిజెపి ఎంపీ టిజి వెంకటేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఓడరేవులు నౌకాయాన శాఖ మంత్రి సమాధానం
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం రామాయపట్నంలో నిర్మించనున్న పోర్టుకు కేంద్రం సహాయం చేస్తుందని ఏపీ సర్కార్ కొండంత ఆశ పెట్టుకుంటే అలాంటిదేమీ లేదని కేంద్రం తేల్చేసింది. విభజన చట్టం ప్రకారం పెద్ద పోర్టుల అభివృద్ధి మాత్రమే కేంద్రం బాధ్యత అని పేర్కొంది . బిజెపి ఎంపీ టిజి వెంకటేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఓడరేవులు నౌకాయాన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రామాయపట్నం పెద్ద పోర్టు కాదని రాష్ట్ర ప్రభుత్వమే పేర్కొందని, నాన్ మేజర్ పోర్టుల అభివృద్ధి బాధ్యత కేంద్రానిది కాదని స్పష్టం చేశారు.

నాన్ మేజర్ పోర్టుల అభివృద్ధి బాధ్యత కేంద్రానిది కాదు
ఆయా రాష్ట్రాలే నాన్ మేజర్ పోర్టుల అభివృద్ధి బాధ్యతను నిర్వహించాలని వెల్లడించారు. రామాయపట్నం పోర్టు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే ఏపీ విభజన చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో విభజన హామీలలో భాగంగా నెల్లూరు జిల్లా దుగరాజపట్నం వద్ద ప్రధాన ఓడరేవు నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే దుగ్గరాజుపట్నం ఓడరేవు ఆర్థికంగా లాభదాయకం కాదంటూ ఆ ప్రాజెక్టును నిలిపివేశారు.

దుగారాజపట్నం పోర్టుకు బదులు రామయపట్నంకు సాయం చెయ్యాలని కోరిన ఏపీ సర్కార్
దానికి బదులుగా రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే రామాయపట్నం పోర్టు విషయంలో కేంద్రం తన స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. రామాయపట్నం పోర్టు అభివృద్ధి తమ పరిధిలోకి రాదని తేల్చిచెప్పిన కేంద్రం పోర్టు అభివృద్ధి బాధ్యత పూర్తిగా రాష్ట్రానిదేనని ప్రకటించింది. రామాయపట్నం పోర్టు కు కేంద్ర సర్కార్ మొండిచెయ్యి చూపించటంతో ఏపీ సర్కార్ కు షాక్ తగిలినట్టయ్యింది .

కేంద్రం ప్రకటనతో పూర్తి నిర్మాణం భారం జగన్ సర్కార్ పైనే
ఇప్పటికే 14 వేల కోట్ల రూపాయల అంచనాలతో రెండు దశల్లో ఈ పోర్టును నిర్మించాలని నిర్ణయించిన జగన్ సర్కార్ అందుకు కావలసిన బిడ్ లను ఆహ్వానించింది. అరబిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో బిడ్ ను సమర్పించింది . ఈ పోర్టు నిర్మాణానికి కేంద్రం నుండి సహాయం అందుతుందని భావించిన ఏపీ సర్కార్ కు తాజాగా కేంద్ర ప్రకటన షాక్ ఇచ్చింది. దీంతో రామాయపట్నం పోర్టు నిర్మాణ బాధ్యత పూర్తిగా ఏపీ సర్కార్ పై పడింది. అసలే ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న జగన్ సర్కార్ కు పోర్ట్ నిర్మాణం కూడా భారం కానుంది .












Click it and Unblock the Notifications