హాస్యాస్పదంగా మారిన వైసీపి ఎంపీల రాజీనామాలు..
Recommended Video
ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన వైసీపి ఎంపీల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. పునర్ ద్రువీకరణ పత్రం అడిగిన స్పీకర్ ఇప్పుడు విదేశాలకు పర్యటనకు వెళ్లారు. స్పీకర్ మహాజన్ వచ్చేంత వరకు రాజీనామాల ఆమోదం పొందనట్టే లెక్క. ఐతే రాజీనామాలు ఆమోదం పొందకుండానే., ఆమోదం పొందినట్టు, టీడిపి ఎంపీలు చిత్త శుద్దిని నిరూపించుకోవాలని మీడియా ముందు సవాల్ విసిరారు వైసీపి ఎంపీలు. స్పీకర్ సుమిత్రా మహజన్ విదేశాలకు వెళ్లడంతో రాజీనామాల అంశం మరోసారి ప్రజల నోళ్లలో నానుతోంది. రాజీనామాల ఆమోదం గురించి వైసిపి హడావిడి లో ఎంత డ్రామా ఉందో చెప్పకనే చెప్పుకుంటున్నారు ఏపి ప్రజలు..
రాజీనామాలు ఆమోదం పొందకుండానే హడావిడి చేసిన వైసిపి ఎంపీలు..
మనం పిల్లలకు ఓ కథ చెబుతుంటాం. దాని పేరు ‘రాజుగారు - ఏడు చేపలు ' ఆ కథలో చివరికి వచ్చే సరికి ఓ చేప ఎండదు. అప్పుడు ‘ఓ చేప చేప నువ్వెందుకు ఎండలేదు ? ‘ అని కథలో చేపను ప్రశ్నిస్తాం. వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారం కూడా ఇప్పుడు అచ్చు ఆ కథనే తలపిస్తోంది. ఓ రాజీనామా.. రాజీనామా.. నువ్వెందుకు ఆమోదం పొందలేదు అన్న ప్రశ్న వినిపిస్తోంది. కథలో చేప ఎండకపోవడానికి పలు సాకులు ఉంటాయి... కానీ, వైసీపీ ఎంపీల రాజీనామాలు ఎందుకు ఆమోదం పొందలేదనడానికి పెద్ద సాకులేం కనిపించడం లేదు. అవి ఆమోదం పొందలేదంతే...!
ఆమోదం పొందిన తర్వాత మీడియా ముందకు వస్తే బాగుండేదని అంతర్గత చర్చ..
ఈ నెల ఆరును స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసి బయటకు వచ్చిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గంభీరంగా ఓ ప్రకటన చేశారు. ‘ఇక మా రాజీనామాలు ఆమోదం పొందినట్టే ‘ అన్నది ఆ ప్రకటన సారాంశం. కానీ, వైవీ మాటకు విలువ లేకుండా పోయింది. ఇదిగో ఆమోదం... అదిగో ఆమోదం అనుకోవడమే తప్ప ఇంత వరకు వైసీపీ ఎంపీల రాజీనామాల పై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. పైగా వాటిపై నిర్ణయాన్ని అలా పక్కన పెట్టేసి... ఆవిడ విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. మళ్లీ ఈ నెల 19 వరకు ఆవిడ తిరిగి రారు. అంటే, అప్పటి వరకు రాజీనామాల వ్యవహారం ఎటూ తేలేది లేదన్నమాట.
సీరియస్ అంశం నాన్ సీరియస్ గా మారిపోయిందని మదనపడుతున్న ముఖ్యనేతలు..
ప్రత్యేక హోదా కోసం పదవులకు రాజీనామాలు చేస్తున్నామంటూ వైసీపీ ఎంపీలు ఆ మధ్య బడ్జెట్ సమావేశాలు ముగిసీ ముగియగానే పత్రాలు స్పీకర్ కు ఇచ్చేసి వచ్చారు. నెల రోజులు దాటినా వాటి పరిస్థితి ఏమిటన్న దానిపై అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎవరైనా సభ్యుడు సభ జరుగుతోన్న సమయంలో రాజీనామా ఇస్తే తక్షణం ఆమోదిస్తుంటారు. గతంలో నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వం విషయంలో ఇలాగే జరిగింది. కానీ, వైసీపీ ఎంపీలు మాత్రం సభ ముగిసిపోయాక లేఖలు ఇచ్చొచ్చారు. అప్పట్లోనే దీనిపై విమర్శలు వచ్చాయి. ఆ రాజీనామాలు ఏమయ్యాయి అని మీడియాలో కథనాలు మొదలు కావడంతో తాజాగా స్పీకర్ ను కలిశారు.
ఒకే అంశం పట్ల ప్రజలను అసహనానికి గురి చేయొద్దనే యోచనలో వైసీపి..
జూన్ ఆరున కలవాల్సిందిగా ఆవిడ కోరడంతో ఆ రోజు మరోసారి కలిశారు. అప్పటికీ రాజీనామాలు ఆమోదించని స్పీకర్... రీ కన్ఫర్మేషన్ కోసం లేఖలు ఇవ్వాలని కోరారు. ఆవిడ కోరినట్టుగానే లేఖలు ఇచ్చేసి మహాజన్ తో ఓ గ్రూప్ ఫోటో కూడా దిగారు వైసీపీ ఎంపీలు. తమ ఎంపీలు త్యాగాలు చేశారంటూ పాదయాత్ర నుంచి జగన్ వెంటనే ఓ ప్రకటన చేసేశారు. కానీ, సమయం గడిచిపోతోంది తప్ప... వారి త్యాగాలను స్పీకర్ గుర్తించడం లేదు. అదే సమయంలో వైసీపీ రాజీనామాల వ్యవహారాన్ని డ్రామాగా టీడీపీ అభివర్ణిస్తూ వస్తోంది. బీజేపీతో కుమ్మక్కై వైసీపీ ఈ రాజీడ్రామాలు ఆడుతోందని ఆరోపిస్తోంది. ఇప్పుడు వారి రాజీనామాలు ఆమోదం పొందినా ఉపయోగం లేదంటోంది ఆ పార్టీ. సాధారణ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ గడువు ఉన్నందన ఉప ఎన్నికలు రావంటోంది. ఈ నెల 19న స్పీకర్ తిరిగి వచ్చాక.... ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందో తెలియదు. రాజీనామాలు ఆమోదం పొందితే వచ్చే పది నెలల పాటు ఆ అయిదుగురు ఎంపీలు రాజకీయ వితంతువులు కావడం ఖాయం. ఎందుకంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు కాబట్టి !