దేవరగట్టు కర్రలసమరం రక్తసిక్తం: 50మందికి పైగా గాయాలు; ఇద్దరి పరిస్థితి విషమం, ఒకరు మృతి!!
దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల సమరం మరోమారు రక్తాన్ని చిందించింది. సుమారు రెండు గంటల పాటు కురిసిన జోరు వానలోనూ బన్నీ ఉత్సవం పేరుతో సాగిన కర్రల సమరం 50 మందికి పైగా జనాలను గాయాలపాలు చేసింది. దేవరగట్టులో జరిగే కర్రల సమరంలో ఈ సంవత్సరం ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఉత్సవాన్ని చూడటానికి వచ్చిన ఒకరు గుండెపోటుతో మృతి చెందడంతో విషాదం మిగిలింది.
దేవరగట్టు కర్రల సమరం.. బన్నీ ఉత్సవం పేరుతో హింస
దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి విగ్రహం కోసం రెండు వర్గాలకు చెందిన వారు వేలాదిమంది కర్రల సమరం చేస్తారు. స్వామివారిని తీసుకు వెళ్లడం కోసం ఇరువర్గాలు కర్రలతో కొట్టుకుంటారు సాంప్రదాయ ఉత్సవం పేరుతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటారు. ఇక సాంప్రదాయ ఉత్సవం హింసాత్మకంగా మారడంతో ఈ ఉత్సవాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. అయినప్పటికీ అనాదిగా సంప్రదాయ ఉత్సవంలో భాగంగా తాము కర్రల సమరం చేస్తున్నామని, ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టేది లేదని దేవరగట్టు వాసులు తేల్చిచెప్పారు.

రక్తసిక్తమైన దేవరగట్టు కర్రల సమరం.. 50 మందికి పైగా గాయాలు
అయితే దేవరగట్టు కర్రల సమరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా అది విఫలం అవుతూనే ఉంది. ఇక తాజాగా నిన్న దసరా రోజు జరిగిన కర్రల సమరంలో హింసాత్మక ధోరణి చోటుచేసుకుంది. కర్రల సమరంలో భాగంగా కొట్టుకున్న ఇరు వర్గాలకు చెందిన వారి తలలు పగిలాయి. దేవరగట్టు కర్రల సమరం రక్తసిక్తమైంది. 50 మందికి పైగా గాయాలపాలు కాగా ఈ ఘటనలో గాయపడిన భక్తులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు.

మాల మల్లేశ్వర స్వామి విగ్రహం కోసం కొట్టుకున్న ఇరు వర్గాలు
అయితే ఈ ఘటనలో గాయపడిన వారి వివరాలు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. అత్యంత ఘనంగా మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలను చూడడం కోసం భారీ సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రజలు వస్తారు. సుమారు ఎనిమిది వందల అడుగుల కొండపైన ఉన్న మాల మల్లేశ్వర స్వామి ఆలయానికి విగ్రహాన్ని చేర్చడంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకుంటూ పోటీపడతారు. అడుగడుగున ఆంక్షలు ఉన్నా లెక్కచేయకుండా కర్రల సమరం చేసిన భక్తులు బన్నీ ఉత్సవంలో పాల్గొని గాయాల పాలయ్యారు.

కర్రల సమరం లో హింస .. ఆపలేకపోతున్న అధికారులు
ఈ కర్రల సమరం విషయంలో సుమారు 40 గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించటానికి ప్రయత్నం చేస్తున్నా, హింసాత్మక ధోరణి విడనాడాలని విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. ప్రతియేటా రక్తం చిందిస్తూ దేవరగట్టు కర్రల సమరం కొనసాగుతూనే ఉంది. భక్తి పేరుతో జనాలు హింసకు పాల్పడుతున్నా అధికారులు కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications