కేంద్రం నుండి త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది; కేంద్ర కార్యదర్శుల బృందంతో భేటీ తర్వాత సాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, అంచనా వ్యయాన్ని ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, సానుకూలంగా ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. కేంద్ర కార్యదర్శుల బృందంతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ నేపథ్యంలో రెండు గంటల పాటు అనేక అంశాలపై చర్చలు జరిగాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సమావేశం నిదర్శనమని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

పోలవరం సవరించిన అంచనాలను యధావిధిగా ఆమోదించటం కోసం అవగాహన
గతంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చిన వినతిపత్రంలోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించామని, రాష్ట్రంలోని అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర కార్యదర్శుల బృందంతో జరిగిన ఈ సమావేశం చాలా సానుకూల దృక్పథంతో జరిగిందని, త్వరలోనే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి సమాచారం వస్తుందని ఆశిస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పోలవరం సవరించిన అంచనాలను యధావిధిగా ఆమోదం తెలపడం కోసం ఒక అవగాహనకు వచ్చామని విజయ సాయి రెడ్డి వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ
కేంద్ర ప్రభుత్వం నుండి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారని, ఈ సమావేశంలో చర్చించిన అంశాలకు కొనసాగింపుగా సంబంధిత రాష్ట్ర అధికారులు నిరంతరం సంబంధిత శాఖల కార్యదర్శులతో సంప్రదింపులు జరుపుతారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. పెండింగ్ అంశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం పునరావాసంతో సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగాయని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు .

రాష్ట్రంలో రెవెన్యూ లోటు పై చర్చించామన్న విజయసాయి రెడ్డి
రాష్ట్రంలో రెవెన్యూ లోటు పై చర్చించామని, బడ్జెట్ సమయంలో బిజీగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండున్నర గంటల పాటు తమకు సమయం ఇచ్చి అనేక అంశాలపై చర్చలు జరిపారని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెండింగ్ సమస్యలపై కేంద్రం తో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం భేటీ అయిన ఈ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పాల్గొన్నారు . విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సంస్థలు అన్నిటికీ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం కేంద్ర ఉన్నతాధికారుల బృందాన్ని కోరింది.

నిధుల మంజూరుకు విజ్ఞప్తి.. ఇంకా ఏపీకి సంబంధించిన అనేక అంశాలపైనా
సవరించిన అంచనా వ్యయం ఆమోదించి నిధులను విడుదల చేస్తే యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని, పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను త్వరితగతిన మంజూరు చేసి ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా చూడాలని, పునరావాసానికి సంబంధించిన బాధ్యతను కూడా కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉందని రెవెన్యూ లోటును భర్తీ చేయడం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్ క్లియరెన్స్ రెన్యువల్ చేయాలని, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వీలైనంత త్వరగా మెకాన్ సంస్థ నివేదిక అందేలా చూడాలని ఈ మీటింగ్ లో వెల్లడించారు.












Click it and Unblock the Notifications