ఏపీ గంజాయిపై మాట్లాడిన తెలంగాణా పోలీసులపై కేసులు పెట్టే దమ్ముందా? జగన్ కు గోరంట్ల సవాల్ !!
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అన్నది అర్థం కావడం లేదంటూ జగన్ సర్కార్ పాలన పై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిందన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి దానిని సమర్థించడం హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు.
జగన్ ..ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలు నీకు వెన్నతో పెట్టిన విద్య : గోరంట్ల
పరిటాల రవిని పట్టపగలు చంపారు అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి,దానికి ఎవరు కారణమో చెప్పాలన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నావ్ కానీ ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలు నీకు వెన్నతో పెట్టిన విద్య అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా సాగవుతుందని, దేశ వ్యాప్తంగా ఇక్కడి నుండి గంజాయి సరఫరా అవుతుందని తెలంగాణ పోలీసులు చెప్పారు అని పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెలంగాణ పోలీసుల పై కేసులు పెట్టగలరా అంటూ ప్రశ్నించారు. ఆ దమ్ము మీకుందా అంటూ నిలదీశారు. ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు.

ఎన్టీఆర్ భవన్ కు వచ్చే మార్గంలో ఆంక్షలపై మండిపడిన గోరంట్ల
ఇదే సమయంలో ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ కు వచ్చే మార్గంలో కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు రహదారిపై బారికేడ్లు, ముళ్లకంచెలు అడ్డు పెట్టిన పోలీసులు ఎన్టీఆర్ భవన్ కు వచ్చే వారిని అడ్డుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు మరోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు అని జగన్ సొంత మీడియాలో స్క్రోలింగ్ వేసుకోవడం కాదని తగ్గించడానికి అవకాశం ఉన్నా తగ్గించకుండా పెంచుతున్నారు కదా దాని మీద వేయండి స్క్రోలింగ్ అంటూ జగన్ ను టార్గెట్ చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
వైసీపీ టెర్రరిస్ట్ ఎటాక్ అంటూ గోరంట్ల ఆగ్రహం
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ సీఎం అని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సామాన్య మధ్య తరగతి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పై జరుగుతున్న దాడులు వైసీపీ టెర్రరిస్ట్ ఎటాక్ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు చంద్రబాబు నిరసన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల నిరసన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ధ్వంసమైన టిడిపి ప్రధాన కార్యాలయంలోనే నిరసన దీక్ష చేపట్టారు.
కొనసాగుతున్న చంద్రబాబు రెండో రోజు దీక్ష
ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో ఆయన చేపట్టిన ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలుపుతున్నారు. నిన్న ఉదయం ప్రారంభించిన దీక్షలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వ ఉగ్రవాదంపై మండిపడ్డారు. రోజంతా దీక్ష సాగించిన చంద్రబాబు రాత్రి పదిన్నర గంటల తరువాత దీక్షాస్థలి పైనే నిద్రించారు. తిరిగి ఉదయం 5 గంటలకు నిద్ర లేచిన చంద్రబాబు నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు ఈ రోజు రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున టిడిపి మద్దతు ధరలు టిడిపి ప్రధాన కార్యాలయానికి చేరుకుని చంద్రబాబు దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.












Click it and Unblock the Notifications