వర్ష బీభత్సం, బాబు అప్రమత్తం: గ్రామాల్లోకి నీరు, హెలికాప్టర్ ద్వారా ఆహారం
చిత్తూరు/కడప/నెల్లూరు: దక్షిణ కోస్తా - తమిళనాడు మధ్య భారీ అల్పపీడనం కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోను వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కాగా, చిత్తూరు, నెల్లూరు, కడప తదితర జిల్లాల్లో వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు నీట కొట్టుకుపోతున్నాయి. పలు రైళ్లను రద్దు చేశారు. మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నీటిలో నిలిచిన బస్సు, ప్రయాణీకుల ఇక్కట్లు
వరధ ఉధృతికి ఓ చోట ప్రయివేటు బస్సు నీటిలో నిలిచిపోయింది. ఆహారం, నీళ్లు లేక ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో నాలుగు రైళ్లను నిలిపేశారు. దీంతో, ప్రయాణీకులు సరైన ఆహార వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు.
జలదిగ్బంధంలో గ్రామాలు
కుండపోత వర్షంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పునరావాసం
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయింది. నెల్లూరు జిల్లాలో పదివేల మందికి, చిత్తూరు జిల్లాలో నాలుగు వేల మందికి పునరావాసం కల్పించింది.
యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు
అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఇతర అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. లోతట్టు ప్రాంతాలను అధికారులు అఫ్రమత్తం చేశారు.
భారీ వర్షాలు
రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ, కోస్తాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోను వర్షాలు ఉంటాయి.
కొట్టుకుపోతున్న వాహనాలు
భారీ వర్షాల కారణంగా వాహనాలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. బస్సులు, ఇతర వాహనాలు వరద నీటిలో నిలిచిపోయాయి. గుంతకల్ రైల్వే డివిజన్లో కొచ్చి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
భారీ వర్షాల నేపథ్యంలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు వచ్చాయి. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
చెన్నై నుంచి హెలికాప్టర్లు
చెన్నై నుంచి రెండు హెలికాప్టర్లు రప్పించారు. వరద నీటిలో చిక్కుకుపోయిన వారికి ఆహార పొట్టాలను అందిస్తారు. అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. కాగా, తీరం వెంట 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
గ్రామంలోకి నీరు
చిత్తూరు జిల్లా తిరుపతిలోని పాకాల మండలంలో ఓ కుంట తెగింది. మాణిక్ రాయునిపాలెం గ్రామం నీట మునిగింది. భారీగా వరద నీరు గ్రామంలోకి వస్తుండటంతో గ్రామస్థులు భయంతో పరుగులు తీస్తున్నారు.
ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సమీక్ష
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ వర్షాల పైన సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఎప్పటికి అప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చిత్తూరు వెళ్తున్నారు. వర్షాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇవ్వనున్నారు.