మోసం... జగన్! వదిలి రా: టీడీపీ నేతలు భగ్గు, 'పవన్! మాట్లాడవేం, ఏ ముఖం పెట్టుకొని బీజేపీలో చేరారు'
కడప: కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం కుదరదని సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంపై టీడీపీ నేతలతో పాటు కడప జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీని సైతం కేంద్రం నెరవేర్చడం లేదని మండిపడుతున్నారు.
కేంద్రం తీరును నిరసిస్తూ గురువారం కడప జిల్లావ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేశారు. టీడీపీ, వైసీపీ, సహా పలు పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు, ర్యాలీలు చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ నేతలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, ఆదినారాయణ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను చేపట్టే దీక్షకు అందరు మద్దతివ్వాలి
కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం చేపట్టే దీక్షకు అందరూ మద్దతివ్వాలని రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ విజ్ఞప్తి చేశారు. దీక్షలు చేయవద్దని, ఉక్కు పరిశ్రమ పెడతామని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆ మాటలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే అన్నారు.
అసలు కేంద్రానికి ఆ ఉద్దేశ్యం లేదు
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం దారుణంగా మోసం చేసిందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టే ఉద్దేశ్యం కేంద్రానికి లేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పైన సాధ్యాసాధ్యాలను టాస్క్ఫోర్స్ పరిశీలిస్తోందని ఉక్కుమంత్రిత్వ శాఖ ప్రకటన చేసిందని గుర్తు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
మోడీకి ఇచ్చిన లేఖలో 12 అంశాలు, అందులో హోదా లేదు
ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చిన లేఖలో కన్నా లక్ష్మీనారాయణ 12 అంశాలను ప్రస్తావించారని గల్లా జయదేవ్ చెప్పారు. ఆయన ప్రస్తావించిన 12 అంశాలలో స్టీల్ ప్లాంట్ కూడా ఉందన్నారు. ఆ లేఖలో ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్ల ప్రస్తావన లేదన్నారు. ఏపీకి బీజేపీ ద్రోహం చేసిందన్నారు.
జగన్! వదిలి రా.. కలిసి పోరాడుదాం
ఏపీకి బీజేపీ నమ్మకద్రోహం చేసిందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. బీజేపీతో విడిపోయిన తర్వాత ఫ్యాక్టరీని పక్కన పెట్టేశారన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఈ నెలాఖరులో ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారన్నారు. ఆయన దీక్షా వేదికను ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీపై జగన్ ఒక్క ప్రకటన కూడా చేయలేదని మండిపడ్డారు. జగన్! పాదయాత్ర వదలి రా... స్టీల్ ఫ్యాక్టరీ కోసం కలిసి పోరాడుదామని ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
కేంద్రం అన్యాయం చేస్తోందని వైసీపీ ఎంపీ
కడప పట్టణంలో బీజేపీ సీనియర్ నేత కందుల రాజమోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నించింది. దీంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద మోహరించారు. నిరసనకారులు బీజేపీ నేత ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసగా వారంతా రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలందరినీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న కడప ఉక్కు పరిశ్రమ ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. మెకాన్ సంస్థ నివేదిక పట్టించుకోకుండా సుప్రీంకు అఫిడవిట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
మోడీని పవన్ కళ్యాణ్ ఎందుకు నిలదీయట్లేదు
ఏపీ పట్ల ప్రధాని మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఏపీసీసీ విమర్శించింది. ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ప్రకటన విడుదల చేశారు. ఏపీకి హోదా ఇవ్వకుండా విభజన చట్టం అమలు చేయకుండా నాటకాలడుతుంటే బీజేపీ ఏపీ నేతలు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. పార్లమెంటు ఆమోదించిన విభజనచట్టంలో కడప జిల్లాలో సమీకృత ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారని, మోడీ సర్కార్ కావాలనే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కాలయాపన చేస్తోందన్నారు. కడపలో ముడి ఖనిజం నాణ్యత సరిగా లేదని, అనువైన పరిస్థితులు లేవంటూ కుంటి సాకులు చెబుతోందన్నారు. నాడు రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ను వీడిన కొంతమంది నాయకులు ఏ ముఖం పెట్టుకుని బీజేపీలో చేరారని కన్నా, పురంధేశ్వరి వంటి నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. అలాగే, జగన్కు ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సంకల్పం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై మోడీని ఎందుకు నిలదీయరన్నారు. వీరందరికీ నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం మోడీ ఇంటి ఎదుట ధర్నా చేయాలన్నారు. ఇందుకోసం కలసి పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ఈ దిశగా ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యేలా సీఎం చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ధర్మ పోరాటం పేరుతో దీక్షలు చేస్తూ ప్రజాధనం వృథా చేస్తే కేంద్రం దిగిరాదన్నారు.