జగన్ వర్సెస్ కేసీఆర్ ... ఇద్దరూ సమ ఉజ్జీలే.. తాజా జలజగడం వెనుక ఆధిపత్య పోరు !!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ క్రమంగా పెరుగుతుందా ? కెసిఆర్ వర్సెస్ జగన్ అన్న తీరుగా పరిస్థితి మారుతుందా ? గత ఎన్నికలకు ముందు, ఎన్నికల ఫలితాల తరువాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సోదర భావంతో తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని ప్రకటనలు చేసుకున్న నాయకులు ఒక్కసారిగా ఎందుకు ఇలా మారారు ? అసలు కెసిఆర్ కు జగన్ కు మధ్య తాజా వివాదాలకు మరేదైనా ఇతర కారణం ఉందా? ఇది తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం.
అప్పుడు కేసీఆర్ పెద్దన్న పాత్ర .. సీఎం జగన్ పీఎం మోడీకి లేఖ రాసింది అందుకే : సజ్జల వ్యాఖ్యలు
అప్పట్లో చేతులు కలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
గత ఎన్నికల సమయంలో చంద్రబాబుపై పగతో రగిలిపోయిన కేసీఆర్, చంద్రబాబుకు చెక్ పెట్టడం కోసం వైయస్ జగన్ తో చేతులు కలిపారని అప్పట్లో టిడిపి నేతలు పదే పదే విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నేతలు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేయడం వంటి సంఘటనల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినట్లుగా అందరూ భావించారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో జగన్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని ప్రకటనలు కూడా చేశారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల మైత్రి .. ఆసక్తికర భేటీలు
ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలు , అతిధి మర్యాదలు, ఆలింగనాలు అప్పట్లో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన పంచాయితీలు, జల జగడాలు ఈ ఇద్దరి కలయిక తో పరిష్కారమవుతాయని అందరూ భావించారు .రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పనిచేస్తారని ఇద్దరు సీఎం ల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని అందరూ అనుకున్నారు. అయితే తాజా పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
ఒకరు వైలెంట్ గా .. ఇంకొకరు సైలెంట్ గా .. ఆధిపత్య పోరు
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎడ్డెమంటే తెడ్డెం అంటున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన పంచాయితీలు , జల జగడాలు ఎప్పటి నుండో ఉన్నప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న వార్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కేంద్రం కోర్టులోకి బంతిని నెడుతున్నారు. కానీ ఎవరూ తగ్గటం లేదు. ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రులు అయితే సీఎం జగన్ తండ్రి వైఎస్సార్ ను మించిన గజదొంగ అంటూ పదేపదే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందాం అని, తెలంగాణలో ఆంధ్రా ప్రజలు ఉన్నారని పదే పదే విజ్ఞప్తి చేస్తూనే, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి చెక్ పెట్టాలని కృష్ణా రివర్ బోర్డు కు, కేంద్రానికి లేఖలు రాశారు. కేసీఆర్ తగ్గకుంటే మొత్తం కేంద్రం చేతిలో పెడతా అన్నట్టు సంకేతాలిచ్చారు.
జగన్ మౌనంపై ప్రతిపక్షాలు సీరియస్, అయినా సరే సైలెంట్ గా జగన్ వ్యూహాలు
తాజాగా తెరమీదకు వచ్చిన నీటి వివాదాలు, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు అనుసరిస్తున్న తీరు వెనుక మరో పెద్ద రాజకీయ కోణం ఉందని ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇక ఇదే అదునుగా తెలంగాణలో ఉన్న ఆస్తుల రక్షణ కోసం సీఎం జగన్ మౌనంగా ఉంటున్నారు అని, తెలంగాణ ప్రభుత్వ తీరుతో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు జగన్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసీఆర్ తీరును ఎండగడుతున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం గతంలో సీఎం కేసీఆర్ రాయలసీమ నీటి విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తారని చెప్పారని, ఇప్పుడు ఆయనకు ఏమైందో తెలియదు లేదు అంటూ వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరంగానే మారింది.
కేసీఆర్ తో మిత్రుత్వం డేంజర్ .. జగన్ మనసులో ఉంది ఇదేనా ?
గతంలో రెండు తెలుగు రాష్ట్రాలు నీటి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుందాం అని, నదుల అనుసంధాన ప్రక్రియ చేద్దామని సీఎం కేసీఆర్, జగన్ తో ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని ప్రకటన చేశారు. కానీ ఆ తర్వాత సీఎం కేసీఆర్ వాడుకుని వదిలేసే రకం, అతనితో మిత్రుత్వం డేంజర్ అని ప్రతిపక్షాలు, పలువురు అధికార పార్టీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు కూడా గతంలో అనేక పర్యాయాలు ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
కేసీఆర్ మైత్రి వెనుక జాతీయ రాజకీయ వ్యూహం .. కానీ జగన్ తీరుతో బెడిసికొట్టిందా ?
ఈ క్రమంలోనే తెలంగాణతో కలిసి ముందుకు సాగే విషయంలో సీఎం జగన్ ఆచి తూచి వ్యవహరించాలని భావించారు. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి, తను తానా అంటే తందానా అనే నాయకులు తన వెంట ఉండాలని భావించిన నేపథ్యంలో, సీఎం జగన్ తాను చెప్పిన ప్రతి దానిని అంగీకరిస్తారన్న ఉద్దేశంతో మొదట స్నేహ సంబంధాలకు ప్రయత్నించారు. ఆ తరువాత రాష్ట్రానికి రావాల్సిన వివిధ విభజన హామీల విషయంలో సీఎం జగన్ కూడా కాస్త మొండి వైఖరిని ప్రదర్శించడంతో, జగన్ పై మళ్ళీ ఆలోచనలో పడ్డారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న వేళ పంచాయితీ పెద్దదయ్యింది.
ఇద్దరూ మొండి వాళ్ళే.. ఆధిపత్య పోరే సఖ్యత చెడటానికి కారణమా ?
ఒకవిధంగా ఆలోచిస్తే సీఎం జగన్, సీఎం కేసీఆర్ ఇద్దరూ మొండి వాళ్ళే .సమ ఉజ్జీలే, తాము ఏది అనుకుంటే అది జరిగి తీరాలి అనుకునే నాయకులు. పట్టిన పట్టు వదలకుండా ప్రయత్నం చేసే వాళ్ళు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య సఖ్యత లోపించిందని భావిస్తున్నారు. గతంలో ఆర్టీసీ విషయంలో కూడా పంచాయతీ దీర్ఘకాలం కొనసాగింది. కాని గతంలో కంటే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకుంటున్న జల వివాదాలు తారాస్థాయికి చేరుతున్న పరిస్థితులు కెసిఆర్, జగన్ మైత్రి చెడిందన్న వాదనకు ఊతం ఇస్తున్నాయి. ఆధిపత్య పోరు ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం కాకుండా చేస్తున్న కారణంగా మారుతుందని ఇద్దరు సీఎంల తీరుపై చర్చ సాగుతుంది.