ఒకప్పుడు ఇంజనీరు...ఇప్పుడు బడా స్మగ్లర్:ఎర్రచందనం ఎంత పని చేసింది?
కడప:ఒకప్పుడు అతడో ఇంజనీర్...ఇంజనీరింగ్ విద్యలో ఉన్నత చదువులు అభ్యసించిన అతడు ఓ ప్రైవేటు టెలికాం సంస్థలో మంచి హోదాలో పనిచేసేవాడు. అయితే స్వయంకృతాపరాధమో...విధి రాతో...తెలియదు కానీ...కొంతమంది వ్యక్తుల పరిచయం అక్షరాలా అతడి జీవితాన్నే మార్చేసింది.
ఇంజనీర్ గా సమాజంలో గౌరవప్రదమైన వృత్తి నిర్వహిస్తున్న అతడు కొత్త మనుషుల ప్రభావంతో అడ్డ దారి పట్టాడు. సులభ సంపాదన కోసం ఏకంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కే తెగించాడు. అలా రెడ్ శాండల్ ను అక్రమ రవాణా చేస్తూ అంచెలంచెలుగా బడా స్మగ్లర్ గా ఎదిగాడు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా!...మళ్లీ ఫేట్ మారింది. పోలీసులకు దొరికిపోయాడు. దీంతో నిన్నటిదాకా ఎర్రచందనం కలపదుంగలు లెక్కేసిన అతడు ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు...అతడెవరంటే?
స్మగ్లర్ బ్యాక్ గ్రౌండ్...పోలీసుల ఆశ్చర్యం
కడప జిల్లా రైల్వేకోడూరు సమీపంలోని శేషాచలం అడవుల్లో ఆదివారం కడప పోలీసులు ఒక బడా స్మగ్లర్ తో పాటు మరో ఇద్దరు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత పోలీసులు విచారణలో ఆ బడా స్మగ్లర్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆ తరువాత జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అట్టాడ బాబూజీ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఇంటర్నేషనల్ స్మగ్లర్లతో...డీలింగ్స్
ఈ ఎర్ర చందనం బడా స్మగ్లర్ పేరు ఎత్తిరాజుల శ్రీనివాసులు ఆలియాస్ నాయుడు...ఇతడు ఇంటర్నేషనల్ రెడ్ శాండల్ డాన్లు సాహుల్భాయ్, మన్సూర్, బిలాల్కు ఇక్కడ ప్రధాన అనుచరుడు. వీళ్లతోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన అంతర్జాతీయ స్మగ్లర్లు సేతు మాధవన్, ముస్తఫా, సునీల్ అలియాస్ అర్కట్భాయ్లతో కూడా ఇతడు సంబంధాలు కొనసాగిస్తున్నాడు.
దేశవిదేశాలకు...స్మగ్లింగ్
వారి అండదండలతో ఎర్రచందనం దుంగలను ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తూ ఎత్తిరాజుల శ్రీనివాసులు కోట్లాది రూపాయలు సంపాదించాడు. అలా ఇతడు ఇప్పటి వరకు సుమారు 600 టన్నులకు పైగానే అక్రమ రవాణాకు పాల్పడి ఉంటాడనేది ఒక అంచనా. ఇటీవలే అరెస్ట్ అయిన స్మగ్లర్ డాన్ లు సేతు మాధవన్, షేక్ ముబారక్ ఆలీ, అర్కట్భాయి, సత్యనారాయణ, గిరినాయుడు ఇచ్చిన సమాచారం మేరకు ఎత్తిరాజుల శ్రీనివాసులుపై పోలీసులు పూర్తి నిఘా ఉంచారు.
ఎట్టకేలకు...చిక్కాడు
ఈ క్రమంలో ఆదివారం రైల్వేకోడూరులో ఎర్రచందనం దుంగలు తరలించేందుకు అతడు అనుచరులతో సహా వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వాళ్లు మాటు వేసి ఎత్తిరాజుల శ్రీనివాసులును, అతని అనుచరులు తేనెపల్లి లక్ష్మయ్య, గొడ్డు వినోద్కుమార్లను అరెస్టు చేశారు. వారినుంచి 22 ఎర్రచందనం దుంగలు, 2 కార్లు, 59.4 గ్రాముల బంగారు నగలు, రూ.13,470 నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దుంగల విలువ రూ. 10 లక్షలు ఉండొచ్చని తెలిసింది. దీంతో ఈ బడా స్మగ్లర్ ను పట్టేసిన ఏఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి నేతృత్వంలోని బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందజేశారు.