మళ్లీ వర్షాలు - నేడు అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ : రెండు జిల్లాలపై భారీ ప్రభావం..!!
భారీ వర్షాలు..వరదలతో ఏపీలోని నాలుగు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ప్రాణ నష్టం..ఆస్తి నష్టం భారీగా జరిగింది. రోడ్లు - రైల్వే ట్రాక్ లు దెబ్బ తిని రవాణా వ్యవస్థ పైన ప్రభావం పడింది. అయితే, ఇప్పుడు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి సమాచారం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు-శ్రీలంక తీరంలో(ఈ రోజు) బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Recommended Video
భారీవర్షాలు కురిసే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక-ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీన తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27వ తేదీ వైఎస్సార్ జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు
మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు కోరారు. డిసెంబర్ 15వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు తెలిపారు.
కొనసాగుతున్న వర్షాలు.. సీఎం రివ్యూ
గడిచిన 24 గంటల్లో రాజమండ్రిలో 97.75 మిల్లీమీటర్లు, జంబుపట్నంలో 92.5, గాజువాకలో 64.5, కంటిపూడిలో 58.25, నిడదవోలులో 56.5, తాడేపల్లిగూడెంలో 55.25, భీమడోలులో 49.75, ప్రత్తిపాడులో 41, రెడ్డిగూడెంలో 39.25, నర్సీపట్నంలో 34.75, మాడుగులలో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది.
ముఖ్యమంత్రి జగన్ నాలుగు జిల్లాల కలెక్టర్లతో ఈ రోజు వీడియో కాన్ఫిరెన్స్ ఏర్పాటు చేసారు. ఇప్పటికే భారీగా నష్టం జరగటంతో.. మరోసారి ముందస్తు చర్యలు..పునరావాస శిబిరాల పైన అధికారులను సంసిద్దులను చేయనున్నారు. దీంతో..సీమ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు..నీటి నిర్వహణ... చెరువుల పరిస్థితి పైన ఇరిగేషన్ శాఖ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.