అక్కడ ఫెయిల్.. ఏపీలో సక్సెస్.. జగన్ ముందు చూపు వల్లే..
కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ఇస్తున్న ఫలితాల్లో కచ్చితత్వ లోపాలు ఉండటంతో.. రెండు రోజుల పాటు వాటిని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ సహా పలు రాష్ట్రాల్లో టెస్టింగ్ కిట్లలో లోపాలను గుర్తించడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ఉపయోగిస్తున్న కొరియా కిట్ల పనితీరు సంతృప్తికరంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి జగన్కు వెల్లడించారు. కిట్ల పనితీరులో ఎటువంటి లోపాలు లేవని.. ఫలితాల్లో కచ్చితత్వం ఉందని తెలిపారు. నెగటివ్,పాజిటివ్ కేసుల్లో కిట్ల పనితీరు కచ్చితత్వంతో ఉందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు ఈ వివరాలు వెల్లడించారు.

కేంద్రం తెప్పించిన చైనా కిట్లలో లోపాలు
మరోవైపు కేంద్రం తెప్పించిన చైనా కిట్లలో మాత్రం లోపాలు బయటపడటం గమనార్హం. గత నెలలో కేంద్ర ప్రభుత్వం చైనా నుంచి రూ.26 కోట్ల ఖర్చుతో 6.5 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించింది.
గ్వాంగ్జౌ వాండ్ఫో బయోటెక్, జుహై లివ్జోన్ డయాగ్నోస్టిక్స్ కంపెనీల నుంచి వీటిని కొనుగోలు చేసి.. ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేసింది. రాజస్తాన్లో వీటిని ఉపయోగించి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. కేవలం 5.4 శాతమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మరో 2 రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫిర్యాదులు రావడంతో కేంద్రం వీటి వాడకాన్ని 2 రోజులు నిలిపివేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.ఐసీఎంఆర్ బృందాలు రాష్ట్రాలకు వెళ్లి టెస్టింగ్ కిట్లను పరిశీలిస్తాయని చెప్పింది.

జగన్ ముందుచూపు..
నిజానికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తమ రాష్ట్రానికి కూడా పంపించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం మాత్రం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడ కిట్లు ఉన్నా మీరే తెప్పించుకోవాలని సూచించింది. దీంతో ప్రభుత్వం కొరియా నుంచి 1లక్ష కిట్లను వేగంగా దిగుమతి చేసుకుంది. చైనా కిట్లకు బదులు కొరియా కిట్లను దిగుమతి చేసుకుని ఏపీ ప్రభుత్వం మంచి పనిచేసినట్టయింది. లేదంటే.. ఇప్పటికే గుర్తించిన 32వేల మంది అనుమానితుల ర్యాపిడ్ టెస్టులకు బ్రేక్ పడి ఉండేది. ముఖ్యమంత్రి జగన్ ముందుచూపు వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.అటు కేంద్రం సైతం సౌత్ కొరియా నుంచి 5లక్షల ర్యాపిడ్ కిట్లకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. ఏప్రిల్ 30 నుంచి నాలుగు విడతల్లో ఈ కిట్లు భారత్కు రానున్నాయి.

కిట్ల కొనుగోళ్లపై వివాదం..
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పొరుగునే ఉన్న ఛత్తీస్ఘడ్ రాష్ట్రం అదే కొరియా నుంచి రూ.337కి కిట్లను కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.730కి ఎందుకు కొనుగోలు చేసిందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అంతేకాదు,కమిషనర్ల కక్కుర్తితోనే ఇలా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని ఆరోపించాయి. కానీ వైసీపీ ప్రభుత్వం దీనికి ధీటుగా బదులిచ్చింది. కిట్ల దిగుమతికి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే.. అందులో ఓ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నామని చెప్పింది. దేశంలో ఏ రాష్ట్రానికైనా తక్కువ ధరకు కిట్లను అందిస్తే.. తమకూ అదే ధర వర్తిస్తుందని షరతు పెట్టినట్టుగా తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చేనాటికి ఆ కిట్లు బయటి దేశంలోని యూనిట్లలో తయారవుతున్నాయని.. అందుకే ధర ఎక్కువగా ఉందని పేర్కొంది. కానీ ఆ తర్వాత ఐసీఎంఆర్ అదే కంపెనీకి మన దేశంలో అనుమతివ్వడంతో కిట్ల ధర తగ్గిందని చెబుతోంది.












Click it and Unblock the Notifications