మోడీ టూర్ లో రఘురామకు అరెస్ట్ భయం- వచ్చివెళ్లిపోతా- పిచ్చివేషాలొద్దు-ప్రధాని సాయం కోరతా
ఏపీలో 2019లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి ఆ తర్వాత ఆరునెలలకే ఆ పార్టీపై పోరు ప్రారంభించిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు మరోపోరుకు సిద్దమవుతున్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రఘురామ నియోజకవర్గం నరసాపురం పరిధిలోకి వచ్చే భీమవరానికి వస్తున్నారు. ఈ పర్యటనలో ఎలాగైనా పాల్గొనాలని భావిస్తున్న రఘురామను వైసీపీ సర్కార్ అరెస్టు భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని టూర్ కు రఘురామ
వచ్చేనెల 4న ప్రధాని మోడీ భీమవరం టూర్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ మేరకు తనకు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖను కోరారు. అయితే ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పాత కేసుల్ని తిరగతోడి ఆయన్ను అరెస్టు చేసేందుకు సిద్దమవుతోంది.
ఇప్పటికే తాజాగా విశాఖలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ స్ధాయీసంఘం సమావేశానికి హాజరైతే ఆయన్ను అరెస్టు చేస్తామని డీజీపీ హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు రఘురామ భీమవరానికి వస్తే ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.
రఘురామకు అరెస్టు భయం
ప్రధాని మోడీ టూర్ కు రఘురామరాజు రాకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు కల్పించేలా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు రఘురామ చేసుకున్న విజ్ఞప్తిపై ఎలాంటి స్పందన రాలేదు. దీంతో జగన్ సర్కార్ కూడా తన పని తాను చేసుకుపోయేందుకు సిద్ధమవుతోంది. గతంలో రఘురామపై ఆయన సొంత నియోజకవర్గం నరసాపురం పరిధిలోని ఎమ్మెల్యేలంతా కేసులు పెట్టారు. అవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి.
ఇన్నాళ్లూ ఢిల్లీలో ఉన్న రఘురామను అరెస్టు చేయకుండా వదిలేసిన వైసీపీ సర్కార్ భిమవరం వస్తే మాత్రం అరెస్టు చేసేలా కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు ఇవ్వలేదని రఘురామ తెలిపారు. సభాస్థలిలో రెండు వర్గాల మధ్య వైషమ్యాలను సృష్టించి, వాటికి కారణం తానేనని కేసులు పెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
వచ్చి వెళ్లిపోతా..పిచ్చి వేషాలొద్దు
జులై 4న భీమవరంలో జరుగనున్న ప్రధాని సభలో తనను అరెస్టు చేయటానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. అక్కడ పిచ్చివేషాలకు పాల్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు.కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సూచించారు.స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హాజరుకానున్న ప్రధానమంత్రి మోదీ సభలో పోలీసులు తనను అరెస్టు చేయడం వంటి పిచ్చివేషాలకు పాల్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.
ప్రధాని, విపక్షాల సాయం కోరిన రఘురామ
సభకు తన దారిన తాను వచ్చి వెళ్లిపోతానని.. ప్రభుత్వ పెద్దలు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే తన రక్షణపై ప్రధానమంత్రిని అభ్యర్థించాల్సి ఉంటుందన్నారు. తనకు ప్రభుత్వం, పోలీసుల నుంచి ఉన్న హానిని గుర్తించి ప్రతిపక్ష నాయకులు, తమ పార్టీలో అల్లూరి స్ఫూర్తితో పని చేసేవారు రక్షణగా నిలవాలని కోరారు. అల్లూరి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు కొందరు వెళితే ఒకరిద్దరిని పక్కకు పిలిచి రఘురామ సభకు రాకుండా చూడాల్సిన బాధ్యత మీదేనంటూ విజ్ఞప్తి లాంటి హెచ్చరిక చేసినట్లు తెలిసిందన్నారు.