నెల్లూరు శాస్త్రవేత్తకు లండన్ ప్రతిష్టాత్మక అవార్డు
ఎస్పీస్ నెల్లూరు: డీఆర్డీవోలో మిసైల్ శాస్త్రవేత్తగా పని చేస్తున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సతీష్ రెడ్డి ప్రతిష్టాత్మక ఫెలోషిప్ ఆఫ్ రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్, లండన్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అవార్డును ఇప్పటి వరకు 450 మంది పొందారు.
ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు సతీష్ రెడ్డి కావడం గమనార్హం. నెల్లూరు నగరానికి చెందిన సతీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని డీఆర్డీవో రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా పని చేస్తున్నారు.
ఆయన అయిదువేల కిలోమీటర్ల లక్ష్య చేధన కల్గిన అగ్ని క్షిపణి కచ్చితమైన నిర్దేశన కలిగిన నావిగేషన్ వ్యవస్థను తయారు చేశారు. మూడు దశాబ్దాల పాటు నావిగేషన్ వ్యవస్థలో పలు కీలకమైన అధ్యయనాలు చేశారు.
ఇప్పటి వరకు ఆయన రష్యాకు చెందిన అకాడమీ ఆఫ్ నావిగేషన్ అండ్ మిషన్ కంట్రోల్లో సభ్యత్వం, యూకేకు చెందిన రాయల్ ఎరోనాటికల్ సొసైటీలో, ఇండియన్ నేషన్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్స్లో ఫెల్లోషిప్ పొందారు. జూలై 15వ తేదీన లండన్లో జరిగే కార్యక్రమంలో సతీష్ రెడ్డి దీనిని అందుకుంటారు. ఫెలోషిప్ ఆఫ్ రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్ 1947లో ప్రారంభించారు.