చంపుతారనే భయంతో రౌడీషీటర్ వాసును చంపేశారు
గుంటూరు:తమను నిత్యం చంపేస్తామని బెదిరించడంతో ఆత్మరక్షణ కోసమే రౌడీషీటర్ బసవల భారతీ వాసును హత్య చేసినట్టు నిందితులు ప్రకటించారు. వాసును హత్య చేసిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులు ఉపయోగించిన మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
గుంటూరు అరండల్పేటలో ఆదివారం రాత్రి ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న వాసును ఆరుగురు వ్యక్తులు వాహనంతో గుద్ది, నిమిషం వ్యవధిలో 40 సార్లు కత్తితో నరికి అతి దారుణంగా హత్య చేశారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న సింగంశెట్టి సతీష్ అలియాస్ చెగోడీల సతీశ్, కావటి రాజేష్, చక్రకోటి సాయికృష్ణ, షేక్ ఆదాం, గట్టుపల్లి శివరామకృష్ణ, షేక్ సులేమాన్ సోమవారం పోలీసులకు లొంగిపోయారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హత్యకు గురైన బసవల భారతీవాసు పాత గుంటూరుకు చెందినవాడు. గతంలో వాసు అన్న వీరయ్య హత్యకు గురయ్యాడు. ఆ కేసులో నిందితుడైన అశోక్ను వాసు హత్య చేశాడు. ఆ తర్వాత వాసు టూటౌన్కు మకాం మార్చినప్పటికీ పాత గుంటూరు ప్రాంతంపై తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో చెగోడీల తయారీ కంపెనీ యజమాని అయిన సతీశ్, అతని వద్ద పనిచేసే సాయికృష్ణతో వాసు గొడవపడ్డాడు. టీడీపీకి చెందిన సతీశ్ రాజకీయంగా ఎదుగుతుండటం వాసుకి కంటగింపుగా మారింది. దీంతో తరచూ అతన్ని చంపేస్తానని బెదిరించాడు.
కొద్ది రోజుల క్రితం సాయికృష్ణపై దాడి చేసిన వాసు అతన్ని తీవ్రంగా కొట్టాడు. సతీశ్ నుంచి రూ.50వేలు వసూలు చేశాడు వాసు. చెగోడీల కంపెనీ మూసి ఊరి వదిలివెళ్లిపోవాలని సతీశ్కు హుకుం జారీ చేశాడు. దీంతో సతీశ్ తన కంపెనీని మూసివేసి స్వగ్రామం గరుడాచలపాలెం వెళ్లిపోయాడు. అక్కడ నుంచి గుంటూరుకు వస్తూ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద ఉద్యోగానికి చేరాడు. అయినా సతీశ్కు వాసు నుంచి హెచ్చరికలు ఆగలేదు. దీంతో తనను చంపేస్తాడేమోనన్న భయంతో వాసును హత్య చేయాలని సతీశ్ నిర్ణయానికి వచ్చాడు. వాసుపై ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న సతీష్, సాయికృష్ణలు.. వాసుకు ఎవరెవరు శత్రువులు అనే దానిపై ఆరా తీశారు.
దీంతో కావటి రాజేష్, షేక్ ఆదాం, శివరామకృష్ణ, సులేమాన్లు కూడ సతీష్కు జత కలిశారు. వీరందరూ రెండు నెలలుగా ప్లాన్ వేసి, ఆదివారం వాసును మట్టుబెట్టాలని నిర్ణయించారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వాసును అనుసరిస్తూ చివరకు అన్వర్ బిర్యానీ పాయింట్కు చేరుకున్నారు. రెస్టారెంట్ నుంచి వాసు బయటకు రాగానే చంపేశారు.
అనంతరం నిందితులు కారును అమరావతి రోడ్డులో వదిలి వేసి బుడంపాడు వెళ్లిపోయారు. అక్కడ మారణాయుధాలను నీటిలో పడేసి ఓ ఇంటిలో తలదాచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం నిందితులు నల్లపాడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారని పోలీసులు తెలిపారు.