చరిత్ర హీనుడుగా జగన్: మంత్రి ఉమా, రైతుల ఆత్మహత్యలపై జేపీ మండిపాటు
అమరావతి: పట్టిసీమ ప్రాజెక్టుపై కాంగ్రెస్, వైసీపీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమను అడ్డుకుంటే వైయస్ జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టుపై ప్రజలను వైయస్ జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి దేవినేని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పినా జ్ఞానోదయం కాలేదని ఆయన ఎద్దేవాచేశారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్లపై ఉండవల్లి అరుణ్కుమార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.
గోదావరి జలాలను కృష్ణానదిలోకి తీసుకురావడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని మంత్రి ఉమా వ్యాఖ్యానించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ అపర వాస్కోడిగామాలాగా వ్యవహారిస్తున్నారన్నారు. పట్టిసీమపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఉండవల్లి రైతు ద్రోహిగా మిగులుతారన్నారు.
రైతులకు వ్యతిరేకంగా మాట్లాడితే భ్రష్టు పట్టిపోతారన్నారు. ప్రాజెక్టుల గురించి అపశకునంగా మాట్లాడితే భ్రష్టు పట్టిపోతారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు 16న ప్రారంభిస్తారని తెలిపారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అలా మాట్లాడుతున్నారని మంత్రి ఉమా మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు నీరు ఇవ్వాలని తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తోందని మంత్రి తెలిపారు.
రైతుల ఆత్మహత్యలపై జేపీ మండిపాటు
రైతుల ఆత్మహత్యలు పాలకుల పాపమేతప్ప, ప్రకృతి శాపం కాదని లోక్సత్తా జాతీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల మొసలి కన్నీరు వల్ల రైతుల సమస్యలు పరిష్కారం కావన్నారు.
ప్రభుత్వాలు ఇప్పుడు అవలంభిస్తున్న విధానాలను పూర్తిగా మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్యార్డులను బాగు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీటితోపాటుగా స్టోరేజ్ గోదాములను నిర్మించాలని జేపీ ప్రభుత్వాలను కోరారు. అంతేకాకుండా అధిక వడ్డీలకు లోన్లు ఇస్తున్న ప్రైవేటు బ్యాంకులను రద్దు చేయాలని జేపీ సూచించారు.