సీమను సస్యశ్యామలం చేస్తాం: బాలకృష్ణ, కాంగ్రెస్పై..
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన సోమవారం హిందూపురంలో పర్యటించారు. ఆయనతోపాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పరిటాల సునీత, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చిందని ఆరోపించారు.
హంద్రీనీవా ప్రాజెక్టు ఎన్టీఆర్ మానసిక పుత్రిక అని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ కలలను సాకారం చేస్తామని అన్నారు. మూడు జిల్లాల ప్రజలకు ఈ ప్రాజెక్టుతో నీరందుతుందని బాలకృష్ణ చెప్పారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ.. హంద్రీనీవా పనులను త్వరిత గతిన పూర్తి చేస్తామని అన్నారు. బాలకృష్ణ హంద్రీనీవా కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని, తాను కూడా ఈ పనులను త్వరితగతిన వేగవంతం చేయాలనే ఉద్దేశంతోనే హిందూపురంలో పర్యటిస్తున్నామని చెప్పారు.
ప్రజల ఇబ్బందులను దృష్టి పెట్టుకుని ఈ పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. వర్షం కాలం రాకముందే ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. హంద్రీనీవాను పూర్తి చేస్తామని, పనులు పూర్తయ్యే వరకు 15రోజులకొకసారి ఇక్క పర్యటిస్తామని దేవినేని ఉమా చెప్పారు.
2018 వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని దేవినేని తెలిపారు. నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తామని, కేంద్రాన్ని కలుస్తామని చెప్పారు. ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని అన్నారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఏపి రాజధాని కోసం రైతులు, ప్రజలు 32వేల ఎకరాల భూమిని ఇచ్చారని దేవినేని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణమే తమ లక్ష్యమని అన్నారు.