ఏపీ అప్పు రూ.2.16లక్షల కోట్లు: బడ్జెట్ మేనెజ్మెంట్ ఇలానా? బాబును ఏకేసిన బుగ్గన..
ఓవైపు విద్యుత్ వ్యవస్థలో లోపాలున్నాయని కాగ్ చెబుతుంటే, అదే రంగంలో అవార్డులు పొందామని చంద్రబాబు చెప్పుకురావడం హాస్యాస్పదం అని విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 2017-18సంవత్సరానికి రూ.2.16లక్షల కోట్లకు పెరగనున్నాయని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ వృథా ఖర్చులు పెరిగిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన ఆరోపించారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యుత్ వ్యవస్థలోని లోపాలను కాగ్ బయటపెట్టిందని బుగ్గన అన్నారు. నాసిరకం బొగ్గు కొనుగోళ్ల వల్ల జెన్ కోకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఓవైపు విద్యుత్ వ్యవస్థలో లోపాలున్నాయని కాగ్ చెబుతుంటే, అదే రంగంలో అవార్డులు పొందామని చంద్రబాబు చెప్పుకురావడం హాస్యాస్పదం అని విమర్శించారు.
రాష్ట్రంలో బడ్జెట్ మేనేజ్మెంట్ అద్వాన్నంగా తయారైందని అన్నారు. పాత పీడీ అకౌంట్లు క్లోజ్ చేయకుండా కొత్త పీడీ అకౌంట్లు ప్రారంభించారని కాగ్ ఆక్షేపించిన విషయాన్నిబుగ్గన గుర్తుచేశారు. హెలికాప్టర్ అద్దె ఖర్చులను కూడా దుబారా చేశారని, ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ రూ.14.37కోట్లు అదనంగా ఇచ్చారని అన్నారు. హెలికాప్టర్ ను అద్దెకు తీసుకునేప్పుడు సరైన ప్రమాణాలు పాటించలేదని కాగ్ వెల్లడించిందన్నారు.
హెలికాప్టర్ ను పూర్తి సమయం వినియోగించుకోకున్నా అద్దెలు చెల్లించినట్లు కాగ్ చెప్పిందన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు సర్కార్ తీరును బుగ్గన ఎద్దేవా చేశారు. అన్ని దేశాలు తిరిగి సినిమా సెట్టింగ్ వద్ద ఆగిన చందంగా టీడీపీ తయారైందన్నారు. అవినీతిలో ఏపీ నంబర్ 1స్థానంలో ఉందని ఎన్సీఈఆర్ రిపోర్టు చెబుతోందన్నారు.
చంద్రబాబు తనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలే ఎంఏ ఎకనమిక్స్ చదివారన్న భ్రమల్లో ఉన్నారని విమర్శించారు. తమ పార్టీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చంద్రబాబు చదివిన యూనివర్సిటీలోనే చదివారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీహెచ్ డీ చేసినా ఆయనెప్పుడూ డాక్టర్ అన్న పేరు తగలించుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.