'ఇవీ జగన్ విలువలు, బుట్టా రేణుక మోసపోవద్దు, పాదయాత్రపై బాబు బడా మైండ్గేమ్'
తమ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపులు,
అమరావతి: తమ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపులు, ప్రలోభాలు, ప్యాకేజీల పేరుతో రాజకీయం చేస్తున్నారని వైసిపి అధికార ప్రతినిధి పద్మజ నారమల్లి ఆరోపించారు.
రూట్మార్చారు: మంత్రిని చేస్తా.. మీరు చెప్పినంత లేదు.. జగన్కు బుట్టా రేణుక షాక్
హైదరాబాద్లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. నవంబరు 2 నుంచి జగన్ చేపట్టనున్న పాదయాత్రను తక్కువ చేయాలని, పార్టీలో నేతల ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలని వైసిపి నుంచి టిడిపిలోకి మరిన్ని వలసలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
జగన్పై చంద్రబాబు మైండ్ గేమ్
జగన్ త్వరలో పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో అది విజయవంతమవుతుందని భయపడి చంద్రబాబు ఫిరాయింపుల పేరుతో మైండ్ గేమ్కు తెరలేపారని పద్మజ మండిపడ్డారు. జగన్ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని, పాదయాత్రతో ఆయనకు మరింత ఆదరణ పెరుగుతుందనే భయంతో పాదయాత్రను తక్కువ చేయడానికి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.
విద్యార్థి దశ నుంచి నేటి వరకు
చంద్రబాబు విద్యార్థి దశ నుంచీ నేటి వరకు తన రాజకీయ జీవితాన్ని అడుగడుగునా నీచంగా, హీనంగా, కుట్ర, మోసపూరితంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా సాగించారని పద్మజ దుయ్యబట్టారు.
బుట్టా రేణుకకు హితవు
తమ పార్టీ ఎంపీ బుట్టా రేణుక టిడిపిలోకి ఫిరాయించనున్నారనే వార్తలపై పద్మజ స్పందించారు. వాటిని బుట్టా రేణుక ఖండించకపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వైసిపికి ఓటేసి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపిస్తే ప్యాకేజీల కోసం పార్టీ ఫిరాయించడం దౌర్భాగ్యమన్నారు.
బాబును నమ్మి మోసపోవద్దు, ఇవీ జగన్ విలువలు
మోసకారి చంద్రబాబును నమ్మి మోసపోవద్దని పద్మజ హితవు పలికారు. ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి మారాలనుకునే వారు ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపిలో చేరేముందు టిడిపి ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. జగన్ అలా విలువలతో కూడిన రాజకీయం చేస్తారన్నారు.
Recommended Video
ఇది చంద్రబాబు ప్లాన్
కాగా, జగన్ పాదయాత్ర నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ సమయంలో బుట్టా రేణుక వంటి వారిని టిడిపిలో చేర్చుకోవడం ద్వారా.. జగన్ పాదయాత్ర చేసినా ఫలితం లేదని, ఆ పార్టీ వారికే ఆయనపై నమ్మకం లేక టిడిపిలో చేరుతున్నారని చెప్పుకునేందుకే అధికార పార్టీ.. బుట్టా రేణుక వంటి నేతలను పాదయాత్ర సమయంలో తమ పార్టీలో చేర్చుకోవాలనుకుంటోందని భావిస్తున్నారు.