భర్త, అత్తామామ వేధింపులు: అపార్ట్మెంట్పై నుంచి కూతురుతో సహా దూకిన టెక్కీ మనోజ్ఞ
గుంటూరు: నగరంలోని లక్ష్మీపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తతోపాటు అత్తమామల వేధింపులు భరించలేక.. ఓ వివాహిత తన 9 నెలల కూతురుతో ఐదంతస్తుల భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మంగులూరుకు చెందిన మనోజ్ఞ(28)కు, గుంటూరు లక్ష్మీపురానికి చెందిన నర్రా కళ్యాణచంద్రతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కళ్యాణచంద్ర నేవీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తుండగా. మనోజ్ఞ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరికి తులసి అనే 9 నెలల కుమార్తె ఉంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వీరు మూడు నెలల కిందట హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటున్నారు.
ఈ క్రమంలో మనోజ్ఞకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి.
వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ పుట్టింటికి ఫోన్..
మనోజ్ఞ పుట్టింటివారు వివాహ సమయంలో 50 సవర్ల బంగారం, ఐదు సెంట్ల స్థలం, రూ. 2 లక్షల నగదు, ఒక ఇల్లును కట్నంగా ఇచ్చినప్పటికీ.. మనోజ్ఞను భర్త, అత్త కామేశ్వరమ్మ, మామ శ్రీమన్నారాయణ తరచూ వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి. ఈ నేపథ్యంలో నెల రోజుల కిందట తన పుట్టింటికి ఫోన్ చేసిన మనోజ్ఞ.. తనను తీసుకెళ్లాలని.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె పుట్టింటివారు వచ్చి తమ కుమార్తెను తమతో పంపాలని కోరారు. అయితే, కొన్నాళ్ల తర్వాత పంపుతామని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు.
9 నెలలో కూతురుతో అపార్ట్ మెంట్ పైనుంచి దూకిన మనోజ్ఞ..
ఆ తర్వాత మనోజ్ఞకు భర్త, అత్తామామల నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తన కూతురు తులసిని తీసుకుని అపార్ట్మెంట్ ఐదో అంతస్తుకు చేరుకున్న మనోజ్ఞ.. తన కూతుర్ను ముందు భవనంపైనుంచి పడేసి, ఆ తర్వాత తను కూడా దూకేసింది. కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి తులసి మరణించింది. తీవ్రగాయాలపాలైన మనోజ్ఞను.. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
Recommended Video
మునిమనవరాలి కోసం తపించిన ఇంటిపెద్ద.. వారిది ఆత్మహత్యేనా?
మనోజ్ఞ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఐదంస్తుల భవనంపై నుంచి కిందపడితే ఎక్కడు రక్తపుగాయాలు లేకపోవడం, ఉదయం 7.30గంటలకు ఘటన జరిగితే మధ్యాహ్నం వరకు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు మనోజ్ఞ సోదరుడు కార్తీక్. ఇది ఇలావుండగా, తన పేరు పెట్టుకుని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మునిమనవరాలు తులసి మరణంతో.. ఇంటి పెద్దగా ఉన్న తులసమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ దృశ్యం అక్కడున్నవారి మనసులను కలిచివేసింది. కాగా, మనోజ్ఞకు కరోనా ఉన్నట్లు తెలిసింది.