2019లో రెవెన్యూ శాఖను వణికించిన దారుణం .. తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం
2019లో తెలంగాణా రాష్ట్రంలో అనేక విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా రెవెన్యూ శాఖలో జరిగిన దారుణ ఘటన నేటికీ రెవెన్యూ ఉద్యోగులకు టెన్షన్ పుట్టిస్తూనే ఉంది. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని కార్యాలయంలో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన తెలంగాణా రాష్ట్రాన్ని షాక్ కు గురి చేసింది. ఈ కేసును విచారించటానికి సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. దాడికి పాల్పడిన సురేష్ అనే వ్యక్తి సైతం మృతి చెందటంతో ఈ ఘటనకు గల బలమైన కారణాలు తెలీకుండా పోయాయి.
విజయారెడ్డి హత్య ఘటన ... ప్రభుత్వంపై రెవెన్యూ జేఏసీ పోరుబాట .. 30న సింహగర్జన
తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం .. నిందితుడు కూడా మృతి
అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ కార్యాలయంలో విజయారెడ్డి సజీవ దహన ఘటన ఒక్కసారిగా అందర్నీ షాక్ కు గురి చేసింది. నవంబర్ 4న మధ్యాహ్నం తహశీల్దారు కార్యాలయంలో, ఆమె ఛాంబర్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన తహశీల్దార్ అక్కడిక్కడే మంటల్లో మాడి మసైపోయారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి అదే మండలంలోని గౌరెల్లి గ్రామానికి చెందిన కూర సురేశ్ కూడా తనపై కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.
కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్, అటెండర్ మృతి
మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తహశీల్దారును కలిసేందుకు కార్యాలయానికి వచ్చిన సురేశ్.. మాట్లాడాలని చెప్పి నేరుగా తహశీల్దారు ఛాంబర్కు వెళ్లి , తలుపులు వేసి, విజయపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.ఈ క్రమంలో సురేశ్తో పాటు సురేష్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తహశీల్దారు డ్రైవర్, ఆఫీస్ అటెండర్ కు కూడా మంటలు అంటుకుని, గాయాలు అయ్యాయి.విజయారెడ్డిని నిందితుడు సురేశ్ పెట్రోలు పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించినప్పుడు ఆమెను కాపాడబోయిన తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య, డ్రైవర్ గురునాథం కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన .. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత
తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు వివాదాస్పద భూముల కారణమనే వాదన తెరపైకి వచ్చినప్పటికీ నేటికీ ఏ భూములకు సంబంధించిన వివాదంలో విజయారెడ్డి సజీవ దహనం ఘటన జరిగిందో తెలియరాలేదు. అయితే సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖపై చేసిన వ్యాఖ్యల నేపధ్యం లోనే ఈ ఘటన జరిగిందని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అవినీతి కంపు కొడుతున్న రెవెన్యూ వ్యవస్థను శుభ్రపరిచేందుకు కంకణం కట్టుకున్నాను'' అని కేసీఆర్ పదేపదే ప్రకటనలు చేయటంతో రెవెన్యూ శాఖ అవినీతి కూపం అని మచ్చ పడిందని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలను నిరసిస్తూ ఆందోళన బాట పట్టిన రెవెన్యూ ఉద్యోగులకు ప్రజా నుండి సానుకూలత వ్యక్తం కాలేదు. ప్రజలు ఎక్కడికక్కడ రెవెన్యూ ఉద్యోగుల అవినీతిని నిలదీశారు.
సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు .. ప్రజల సపోర్ట్ తో ఫలించని వ్యూహం
ప్రతిపక్ష పార్టీలు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినా ప్రతిపక్షాల ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. ఇక విజయారెడ్డి సజీవ దహనం ఘటన జరిగిన నాటి నుండి నేటి వరకు రెవెన్యూ కార్యాలయాల్లో ఉద్యోగులు భయం గుప్పిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు. ఇక రెవెన్యూ ఉద్యోగుల విషయంలో ప్రజలు మాత్రం తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు.
నేటికీ కొనసాగుతున్న బెదిరింపులు ... టెన్షన్లో రెవెన్యూ ఉద్యోగులు
ఈ ఘటన తర్వాత చాలా రెవెన్యూ కార్యాలయాలలో పెట్రోల్ బాటిల్స్ తో బెదిరింపులు పెరిగిపోయాయి. తమ పనులు చెయ్యకుంటే మీద పోస్తామని కొందరు, ఆత్మహత్య చేసుకుంటామని కొందరు రెవెన్యూ కార్యాలయాల్లో హల్చల్ చెయ్యటం పరిపాటిగా మారింది. తెలంగాణా సర్కార్ రెవెన్యూ ఉద్యోగులకు, ప్రజలకు మధ్య పీఆర్వో వ్యవస్థను పెట్టి పని చేయించాలని నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా రెవెన్యూ వ్యవస్థలో విజయారెడ్డి సజీవ దహనం ఒక భయానక అధ్యాయం . 2019 లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ ఉద్యోగులు విధి నిర్వహణకు వణికిపోతున్నారు.