తప్పతాగి కారుతో బీభత్సం: 12 ఆటోలు ధ్వంసం, ఒకరి మృతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఓ 22ఏళ్ల యువకుడు ఖరీదైన కారు నడుపుతూ పార్కింగ్ చేసిన ఆటోలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ ఆటోడ్రైవర్ మృతిచెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యాయవిద్య చదువుతున్న వికాస్ విజయానంద్ అనే విద్యార్థి సోమవారం ఉదయం కేథడ్రల్ రోడ్డులో మద్యం తాగి కారు నడుపుతూ అదుపుతప్పి పార్కింగ్ చేసి ఉన్న 12 ఆటోలపై దూసుకెళ్లాడు.
ఈ ఘటనలో ఓ ఆటోడ్రైవర్ మృతిచెందగా.. మరో ముగ్గురు డ్రైవర్లు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు కూడా దెబ్బతినడంతో కారు నడిపిన యువకుడికి కూడా గాయలయ్యాయి.
Chennai: 1 dead after a drunk student rams luxury car into 12 parked auto rickshaws; 22-year-old driver arrested. pic.twitter.com/JF6IODULyr
— ANI (@ANI_news) September 19, 2016
ఒక్కసారిగా ఏదో కారు బ్రేకులు గట్టిగా వేసిన శబ్దం వినిపించిందని, ఈలోపు తన గుండె భాగంలో దెబ్బ తగిలి ఒక్కసారిగా కళ్లముందు చీకట్లు అలముకున్నాయని, లేచి చూసేసరికి పోలీసులు వచ్చి కారు నడుపుతున్న కుర్రాడిని లేపి తీసుకెళ్తున్నారని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఆటోడ్రైవర్ సుందర్ చెప్పారు.