రైల్వే స్టేషన్లో కలకలం: కత్తులతో దాడులు చేసుకున్న విద్యార్థులు
చెన్నై: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పట్రవాక్కం రైల్వే స్టేషన్లో రెండు గ్రూపులకు చెందిన విద్యార్థులు తీవ్ర కలకలం రేపారు. మారణాయుధాలతో ఇరు వర్గాలు దాడి చేసుకోవడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన లోకల్ ట్రైన్ పట్టరైవాకం స్టేషన్కు చేరుకోగానే ఈ ఘటన చోటు చేసుకుంది.
చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన లోకల్ ట్రైన్ పట్టరైవాకం స్టేషన్కు చేరుకోగానే అందులో నుంచి దిగిన రెండు గ్రూపుల విద్యార్ధులు కత్తులతో ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. కొందరు విద్యార్థులు కత్తులు ప్రదర్శిస్తూ.. మరో వర్గం విద్యార్థులను వెంబడించి మరీ దాడులు చేశారు.
ఈ ఘటనతో అదే రైల్లో ఉన్న ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. విద్యార్ధుల పరస్పర దాడులతో రైల్వేస్టేషన్ దద్దరిల్లింది. ఈ దాడుల అనంతరం విద్యార్ధులు అదే రైల్లో వెళ్లిపోవడం గమనార్హం.
ఈ ఘటనపై స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దాడులు చేసుకున్న విద్యార్థులను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్నవారు తమ సెల్ఫోన్ల ద్వారా రికార్డు చేసిన వీడియోలను తీసుకుని.. దర్యాప్తు జరుపుతున్నారు.