Goa elections: భవిష్యత్తులో గోవాలో పంచాయతీ స్థాయి నుండి అన్ని ఎన్నికల్లో శివసేన పోటీ: ఆదిత్య ఠాక్రే
గోవాలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు మాటల తూటాలు పేలుస్తూ గోవాలో ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి. తాజాగా శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే గోవాలో ఎన్నికలలో పోటీ చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
Goa elections: భూమి పుత్రులు ఎజెండాతో గోవాలో పట్టుకోసం శివసేన ప్లాన్.. సక్సెస్ అయ్యేనా?
పంచాయతీ స్థాయి నుండి సాధారణ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో శివసేన పోటీ
పనాజీలో విలేకరుల సమావేశంలో ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ, శివసేన పార్టీ గతంలో బీజేపీతో స్నేహం కారణంగా గోవాపై దృష్టి సారించలేకపోయిందని, అయితే తర్వాత బిజెపి వెన్నుపోటు కారణంగా గోవాలో భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని శివసేన నిర్ణయించుకుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోవాలో ఇకముందు పంచాయతీ స్థాయి నుండి సాధారణ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లోనూ శివసేన ఎన్నికల బరిలో ఉంటుందని పేర్కొన్నారు.
గోవాకు శివసేన అవసరం ఉంది
ప్రస్తుతం గోవాకు శివసేన అవసరం ఉందని పేర్కొన్న ఆయన, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ సుస్థిర అభివృద్ధిని సాధించడంలో బిజెపి విఫలమైందని పేర్కొన్నారు. గోవాలో పార్టీ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని ఠాక్రే అన్నారు. ఈ ఎన్నికలు శివసేన భవిష్యత్తు గురించి కాదని , స్థానికులు మరియు వారి భవిష్యత్తు గురించి అని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. శివసేన సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర వెలుపల ఎన్నికల్లో పోటీ చేస్తోందని , గోవా ప్రజలు ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బీజేపీ హయాంలో గోవా అభివృద్ధి చెందలేదు
నీరు, కరెంటు సరఫరా వంటి సమస్యలు ఇప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్నారని, మౌలిక వసతుల లేమితో గోవా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. సమాజంలో విభజనను సృష్టించడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం బిజెపి నాయకులు చేస్తున్నారని, అసంబద్ధమైన విషయాల గురించి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. బిజెపి నాయకుల వల్ల నిజమైన సమస్యలపై దృష్టి సారించే లేక పోతున్నారని ఆదిత్య ఠాక్రే బిజెపిని దుయ్యబట్టారు. బిజెపి హయాంలో గోవా అభివృద్ధి చెందలేదని, బిజెపి నాయకులు మాత్రమే అభివృద్ధి చెందారని ఆదిత్య ఠాక్రే ఆరోపణలు గుప్పించారు.
గోవాలో శివసేన తరపున బరిలో 10 మంది అభ్యర్థులు
2019 మహారాష్ట్ర ఎన్నికల తర్వాత శివసేన బీజేపీతో తెగతెంపులు చేసుకుంది . పొరుగు రాష్ట్రంలో మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) మరియు కాంగ్రెస్తో జతకట్టింది. ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని సేన పోటీ చేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సేన ఈసారి గోవాలో 10 మంది అభ్యర్థులను నిలబెట్టింది.
బీజేపీ టార్గెట్ గా శివ సేన ఎన్నికల ప్రచారం
గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ నియోజక వర్గం నుండి బిజెపి టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో పనాజీ స్థానం నుండి శివసేన పార్టీ తన అభ్యర్థి శైలేంద్ర వెలింగ్కర్ను ఉపసంహరించుకుంది. దీంతో మొత్తం పది స్థానాల్లో గోవా ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివసేన బిజెపిని టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది.