గోవా బరిలో నలుగురు మాజీ సీఎంలు
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు మాజీ సీఎంలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రతాప్ సింగ్ రాణె, రవినాయక్, దిగంబర్ కామత్.
న్యూఢిల్లీ/ పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు మాజీ సీఎంలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రతాప్ సింగ్ రాణె, రవినాయక్, దిగంబర్ కామత్, లుజిన్హో ఫాలైరోలకు కాంగ్రెస్ పార్టీ తొలుత విడుదలచేసిన జాబితాలో చోటు దక్కింది.
ఫాలైరో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) మాజీ సభ్యుడు కావడంతోపాటు ప్రస్తుతం గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా. నలుగురు మాజీ సిఎంలు కావడంతో ఎవరికి వారే తమదైన శైలిలో వ్యూహాలు రూపొందించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ విజయవకాశాలను దెబ్బతీసే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి.
తండ్రీకొడుకులకు టిక్కెట్లు
ప్రతాప్ సింగ్ రాణె కుమార్ విశ్వజిత్ రాణెకూ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.
సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణికి చాన్స్
ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రకాంత్ కావ్లేకర్ భార్య సావిత్రి కావ్లేకర్తోపాటు మరో ముగ్గురు మహిళలను అభ్యర్థులుగా నిలిపింది. తొలి జాబితాలో 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.. శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి), గోవా ఫార్వర్డ్ పార్టీ (జిఎఫ్ పి), యునైటెడ్ గోవాన్స్ పార్టీలతో పొత్తులకు చర్చలు జరుపుతున్నది. 27 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు కొత్త, పాత ముఖాలకు చోటుకల్పించారు.
పొత్తులపై రెండుగా చీలిన కాంగ్రెస్
ఇతర పార్టీలతో పొత్తుల విషయమై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రెండుగా చీలిపోయింది. రాష్ట్రంలోని చిన్నా చితక పార్టీలతో కలిసి పోటీచేసే అంశంపై ఆ పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాతో వ్యక్తిగతంగా చర్చించగల చొరవ గల గోవా పీసీసీ అధ్యక్షుడు లుజిన్హో ఫాలైరో కొన్ని సీట్లు మినహా పూర్తి స్థానాల్లో ఒంటరి పోరుతోనే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని వాదిస్తున్నారు.
ఎన్సిపి, జిఎఫ్పి తదితర పార్టీలతో జట్టుకు కామత్ సై
మాజీ సీఎం దిగంబర్ కామత్ మాత్రం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ), యునైటెడ్ గోవాన్ పార్టీ (యూజీపీ) తదితర చిన్న పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో విపక్ష నేత, యువనేత ప్రతాప్సింగ్రాణే మద్దతు కూడా దిగంబర్ కామత్కే ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా పొత్తులకు సుముఖంగానే ఉన్నారు. కామత్ గ్రూపు బహిరంగంగానే ఎన్ సిపి, జిఎఫ్ పి తదితర పార్టీలతో పొత్తులతో లాభమేనని వాదిస్తున్నది.
అనివార్యం బహుముఖ పోటీలు
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. అధికార బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. ఎన్సీపీ, జీఎఫ్పీలతో కలిసి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతున్నది. ఇప్పటివరకు బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న ఎంజీపీ, శివసేనలు జీఎస్ఎంలతో కలిసి అధికార పక్షానికి సవాల్ విసురుతున్నాయి.
కాంగ్రెస్ అవకాశాలు కొల్లగొట్టేందుకు ఆప్ ఎత్తు
ఢిల్లీలో సంచలన విజయంతో రాజకీయాల్లో ప్రవేశించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) తొలిసారి గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ఇప్పటికే 36 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారబరిలోకి దిగింది. ఐదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేక ఓటును సొమ్ముచేసుకుని కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలని భావిస్తున్నది.
బీజేపీకి మహాకూటమి ఎఫెక్ట్
ఇక బీజేపీతో తెగదెంపులు చేసుకున్న మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), ఆరెస్సెస్ మాజీ కార్యకర్త సుభాశ్వెలింగ్కర్ నేతృత్వంలోని గోవా సురక్షామంచ్ (జీఎస్ఎం) పార్టీ, కేంద్రంలో ఎన్డీఏ మిత్ర పక్షం శివసేన కలిసి మహా కూటమిగా పోటీచేయనున్నాయి. ఈ కూటమి సీఎం అభ్యర్థిగా ఎంజీపీ నేత సుదిన్ ధవాలికర్ బరిలోకి దిగారు.
బీజేపీ జాబితాలో వ్యవసాయ మంత్రి, స్పీకర్ పేర్లు గల్లంతు
బిజెపి ప్రకటించిన తొలి జాబితాలో ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అనంత్ సేథ్, వ్యవసాయశాఖ మంత్రి రమేశ్ తవాద్కర్ పేర్లు మిస్సయ్యాయి. 29 మంది అభ్యర్థుల్లో 18 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు కల్పించింది.
సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్కు బిజెపి మాజీ ఎమ్మెల్యే సవాల్
సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ పై మాండ్రెం స్థానం నుంచి బిజెపి మాజీ ఎమ్మెల్యే దయానంద్ సొప్టె తల పడుతున్నారు. మార్గోవా స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ సీఎం దిగంబర్ కామత్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీలో తొలిసారి నామినేషన్ దాఖలుచేసిన నేతగా కామత్ నిలిచారు.
పిసిసి చీఫ్ వర్సెస్ మత్స్యశాఖ మంత్రి ఫుర్టాడో
గోవా పీసీసీ అధ్యక్షుడు లుజిన్హో ఫాలైరో ప్రస్తుత రాష్ట్ర మత్స్యశాఖ మంత్రిగా ఉన్న అవెర్టానో ఫుర్టాడో ప్రాతినిధ్యం వహిస్తున్న నావెలిం స్థానం నుంచి బరిలో నిలిచారు.