సరిహద్దు వెలుపలి శత్రువులను కూడా చంపగలం: పాక్కు రాజ్నాథ్ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లోని తమ శత్రువులను ఇండియన్ ఆర్మీ తుదముట్టించగలదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దుల్లో తన శత్రువులను చంపడం ద్వారా భారత్ ప్రపంచానికి గట్టి సందేశాన్ని ఇస్తోందని చెప్పారు.
దేశంలోని శత్రువులనే కాదని, సరిహద్దు వెలుపల ఉండే శత్రువులకు కూడా చంపగలమని ఆయన పరోక్షంగా పాకిస్తాన్ను హెచ్చరించారు. సరిహద్దు వెంబడి తరచూ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతోన్న పాకిస్థాన్ రాజ్నాథ్ గట్టి హెచ్చరిక చేశారు.
తాము పొరుగు దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండాలనే కోరుకుంటామని, కానీ వాళ్లు మాత్రం అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తారని, అలాంటి వారికి మేం గట్టి సందేశం ఇవ్వాలనుకుంటున్నామని, భారత్ సరిహద్దు లోపల శత్రువులను మాత్రమే చంపదని, సరిహద్దు వెలుపల ఉండే శత్రువులను కూడా చంపేయగలదన్నారు.
గత మూడు రోజుల నుంచి జమ్మా కాశ్మీర్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. అయిదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు వెంబడి నివసిస్తున్న దాదాపు 40వేల మంది పౌరులను నివాసాలు ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మొత్తం 300 విద్యాసంస్థలను మరో మూడు రోజుల పాటు మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పౌరులను లక్ష్యంగా చేసుకొని తరచూ పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతుండటంతో భయం గుప్పిట్లో బతుకుతున్నామని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.