సర్వే: అమ్మకే తమిళ 'సీఎం' పీఠం, 164 సీట్లు ఖాయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ జయలలితకే అక్కడి ప్రజలు అధికారం కట్టబెట్టనున్నారు. ఈ మేరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకే అనుకూలంగా ఉన్నాయంటూ సర్వేలో వెల్లడైంది.
మే 16న తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీ 164 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తమిళ న్యూస్ ఛానెల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించింది. కాగా, కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేకు 66 స్థానాలకే పరిమితమవ్వగా, ఇతరులు 4 స్ధానాలను కైవసం చేసుకుంటారని సర్వే ద్వారా వెల్లడించింది.
ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేను తమిళనాడుకు చెందిన న్యూస్ ఛానెల్ తలైముపై-ఏపీకి నిర్వహించింది. ఈ సర్వేలో అన్నాడీఎంకే పార్టీకి 38.58 శాతం ఓట్లు వస్తాయని, డీఎంకేకు 32.11 శాతం, డీఎండీకే కూటమికి 8.55 శాతం, పీఎంకేకు 4.47 శాతం, తామిజహార్ పార్టీకి 2.12 శాతం, బీజేపీకి 1.96 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది.
ఈ సర్వేని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 18 నుంచి మే 4 వరకు సుమారు 4.999 మందితో నిర్వహించారు. ఈ ఎగ్జిట్ పోల్ సర్వేను సోమవారం టెలికాస్ట్ చేశారు. ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు అధికార పార్టీ అన్నాడీఎంకే బాగా కలిసొచ్చేలా ఉంది.
అయితే ఈ సర్వేలో భాగంగా కొంత మందిని ఇంటర్యూ చేస్తే వారిలో 51.68 శాతం మంది అన్నాడీఎంకే ప్రభుత్వానికి మరలా ఛాన్స్ ఇవ్వమని చెప్పగా, 42.67 శాతం మంది జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే తమ మద్దతుని ప్రకటించడం విశేషం. ఇక ముఖ్యమంత్రిగా జయలలిత కావాలా కరుణానిధి కావాలా? అన్న ప్రశ్నకు గాను 39.66 శాతం మంది జయలలిత ఓటేయగా, 31.89 శాతం మంది కరుణానిధికి ఓటేశారు.
మరోవైపు డీఎండీకే కూటమికి పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్న విజయ్ కాంత్కు 8.59 శాతం రావడం విశేషం. ఇక అన్భుమణి రాందాస్కు 5.03 శాతం ఓటేశారు. నామ్ తాహింజార్ పార్టీ కన్వీనర్, హీరో సీమన్ను ముఖ్యమంత్రిగా అభ్యర్ధిగా బలపరుస్తూ 2.40 శాతం ఓట్లు రావడం విశేషం.
బీజేపీతో పోలిస్తే, నామ్ తాహింజార్ పార్టీ కాస్తంత మెరుగ్గా ఉండటం విశేషం. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకేతో పోలిస్తే అన్నాడీఎంకే అన్నింటిలో కూడా మెరుగ్గా ఉన్నట్లు అక్కడి ప్రజలు ఓటేశారు. ముఖ్యంగా చెన్నైలో అమ్మ జయకేతనం ఎగురువేసేలా యువ ఓటర్లు ఆమెకే తమ మద్దతుని ప్రకటించడం విశేషం.
జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమ్మ పథకాలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు బాగా చేరువయ్యాయని ఈ సర్వే ద్వారా పేర్కొన్నారు. కాగా ఇటీవల జయలలిత విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కూడా అటు మధ్య తరగతి ప్రజల నుంచి పేద వర్గాలకు అనుకూలంగా ఉండటం జయకు కలిసొచ్చే అంశం.
234 అసెంబ్లీ స్ధానాలున్న తమిళనాడు రాష్ట్రానికి 2011లో జరిగిన ఎన్నికల్లో జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీ (మిత్రపక్షాలు) 203 సీట్లను గెలుచుకోగా, కరుణానిధికి చెందిన డీఎంకే పార్టీ (మిత్రపక్షాలు) 31 సీట్లకే పరిమితమైంది. విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే పార్టీ కూడా జయలలితతో పొత్తు పెట్టుకుంది.