వ్యూహాత్మకంగానే: టైం చూసి రజనీని కలిసిన మోడీ!
చెన్నై: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను ఆదివారం వ్యూహాత్మకంగా కలిశారనే చెప్పవచ్చు. ఈ నెల 24వ తేదీన తమిళనాడులో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో రజనీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడులో బిజెపికి పెద్దగా క్యాడర్ లేదు. దీంతో మరో ఆరు పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. ఆ కూటమిలో పెద్ద పార్టీ అంటే నటుడు విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెనే అని చెప్పవచ్చు. ఈ కూటమితో కొన్ని సీట్లు ఎన్డీయే వశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే, ఢిల్లీ పీఠంపై ఎక్కాలని చూస్తున్న మోడీ అ దిశలో తనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఇందులో భాగంగానే ఆయన వ్యూహాత్మకంగా రజనీని కలిశారంటున్నారు. కొద్ది రోజుల క్రితం రజనీ ఆనారోగ్యంతో ఉన్నప్పుడు మోడీ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఆ సమయంలో ఎప్పుడు చెన్నై వచ్చినా తమ ఇంటికి రావాలని రజనీ కోరారట.
ఆదివారం మోడీ ప్రచారం నిమిత్తం చెన్నై వచ్చారు. ఎన్నికలకు మరో పది రోజుల సమయం ఉండటంతో తమిళనాడులో ప్రజలను ఎన్డీయే వైపు మళ్లించే ఉద్దేశ్యంలో భాగంగానే మోడీ సూపర్ స్టార్ను కలిశారని అంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత తొలుత ఎన్డీయో కూటమిలోకి వస్తారని భావించారు. కానీ ఆమె దూరంగా ఉండటంతో ఆరు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు. చిన్న పార్టీలకు తోడు ఇప్పుడు రజనీకాంత్ను కలిసిన ఫలితం ఎంతో కొంత ఉంటుందని భావిస్తున్నారట. అందుకే ఎన్నికలు మరో పదిరోజులు మాత్రమే ఉండగా కలిశారని అంటున్నారు. అంతేకాకుండా మోడీ పంచెకట్టులో తమిళ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications