కర్ణాటకను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్-ఇప్పటివరకూ 303 మరణాలు-ఒక్క బెంగళూరులోనే 100 మరణాలు
కర్ణాటకను బ్లాక్ ఫంగస్(మ్యుకర్మైకోసిస్) కేసులు వణికిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 303 మంది బ్లాక్ఫంగస్ బారినపడి మృతి చెందారు. ఇందులో ఒక్క బెంగళూరు నగరంలోనే 100 మంది బ్లాక్ ఫంగస్తో చనిపోయారు. మృతులంతా కోవిడ్ నుంచి కోలుకున్నవారే కావడం గమనార్హం.ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3491 మంది బ్లాక్ ఫంగస్ చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ మరణాల రేటు 8.6శాతంగా ఉంది.
జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలిస్తే బెంగళూరు అర్బన్లో 1109,ధర్వాడ్లో 279,విజయపురాలో 208,కల్బుర్గిలో 23,దక్షిణ కన్నడలో 20 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఓవైపు కోవిడ్ కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టగా మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది.
బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ కొరత కూడా మరణాలకు కారణమని చెబుతున్నారు. మే-జూన్ నెల ఆరంభం మధ్యలో అంఫోటెరిసిన్,లిపోసొమాల్ మెడిసిన్ కొరత కారణంగా బ్లాక్ ఫంగస్ మరణాలు సంభవించినట్లు చెబుతున్నారు. బ్లాక్ఫంగస్ చికిత్సలో భాగంగా పేషెంట్లకు రోజుకు 5-7 డోసుల చొప్పున ఈ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మెడిసిన్ కొరత కారణంగా రెండు,మూడు రోజులకు ఒకసారి మాత్రమే స్వల్ప మోతాదులో మెడిసిన్ అందజేసినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే బ్లాక్ ఫంగస్ మెడిసిన్ ఎక్కువగా అందుబాటులో ఉంది. దీంతో చాలామంది బ్లాక్ ఫంగస్ పేషెంట్లను ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
బ్లాక్ ఫంగస్ ముఖం,కళ్లు,చెవులు,మెదడు భాగాల్లో ప్రభావం చూపిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది కంటికి సోకితే చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మెదడు నుంచి ముక్కుకు చేరితే మరణం సంభవించవచ్చు.బ్లాక్ ఫంగస్ సోకినవారిలో జ్వరం,దగ్గు,ఛాతినొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. త్వరగా వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స అందించగలిగితే బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
Recommended Video
కరోనా విషయానికి వస్తే ప్రస్తుతం కర్ణాటకలో చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత శనివారం రాష్ట్రంలో కేవలం 1978 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. బెంగళూరులో కేవలం 433 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 12,19,378కి చేరింది. ఇప్పటివరకూ 11,90,182 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.