భారత్కు పాకిస్తాన్ బదులిస్తే తేలిపోయినట్లే: శరద్ పవార్, మోడీ-ఆరెస్సెస్పై ఇలా
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పుల్వామా దాడి నేపథ్యంలో మంగళవారం వేకువజామున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాయి. అయితే దీనిపై పాక్ తీవ్రంగా స్పందిస్తోంది. భారత్ చర్యపై తమకు ప్రతిస్పందించే హక్కు ఉందని, తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అన్నారు. భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని విమర్శించారు.
పాకిస్తాన్ విమర్శలు
భారత్ దాడుల చేపట్టడంపై అత్యున్నత స్థాయి అధికారులతో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ ఈ రోజు దురాక్రమణకు పాల్పడిందని, నియంత్రణ రేఖ దాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఇందుకు ప్రతిస్పందించేందుకు పాకిస్థాన్కు హక్కు ఉందని, దీనికి ప్రతిస్పందనగా తగిన రీతిలో సమాధానమిస్తామని, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొందని, తామేమీ భయపడటం లేదని షా మహ్మద్ ఖురేషీ చెప్పారు. భారత్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ మళ్లీ గెలిచేందుకు ఇటువంటి చర్యలకు దిగిందని పాక్ సెనెటర్ షెర్రీ రెహ్మాన్ ఆరోపించారు. అందుకే యుద్ధ వాతావరణ పరిస్థితులను భారత్ సృష్టిస్తోందన్నారు.
పాకిస్తాన్ అలాచేస్తే తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లే
అయితే, భారత్పై ప్రతిస్పందించేందుకు తమకు హక్కు ఉందని పాకిస్తాన్ పైన భారత నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్కు బదులుగా పాకిస్థాన్ ఏదైనా ప్రతీకారచర్యకు దిగితే ఆ దేశం ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు రుజువైనట్లేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైన ప్రశంసలు కురిపించారు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దన్నారు. ఈ దాడి ఘనత అంతా సైన్యానిదే అన్నారు.
ఆ ఘనత మోడీకి ఆపాదేస్తే.. ఆరెస్సెస్ది అవుతుంది
ఒకవేళ దాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి ఈ దాడి ఘనతను ఆపాదిస్తే, ఆ ఘనత మొత్తం ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్కు ఇవ్వాలని శరద్ పవార్ విమర్శించారు. అంతర్జాతీయంగా ఎలాంటి విమర్శలు ఎదురుకాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ దాడులు చేపట్టిందన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థలు పుల్వామా ఘటన జరగడానికి కారణమని, వారికి ఐఏఎఫ్ తగిన విధంగా బుద్ధి చెప్పిందని, ఐఏఎఫ్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని భావిస్తున్నానని, ఒకవేళ పాకిస్థాన్ ఈ దాడులకు బదులిస్తే ఉగ్ర సంస్థలకు ఆ దేశం ఆశ్రయం ఇస్తున్నట్లు రుజువైనట్లే అన్నారు. భారత్ ఎవరి మీద దాడికి పాల్పడదని, కానీ దాడి జరిగితే మాత్రం ప్రతీకారం తీర్చుకోకుండా వదలదన్నారు. స్వీయ రక్షణ కోసం దాడులు చేసే హక్కు భారత్కు ఉందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా వ్యాఖ్యానించారు.