మోడీ బర్త్డే: సెకనుకు 466 మందికి వ్యాక్సిన్, 2.5 కోట్ల డోసుల పంపిణీతో భారత్ వరల్డ్ రికార్డ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును సందర్భంగా శుక్రవారం భారత్ వ్యాక్సినేషన్లో ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక రోజులో ఏకంగా 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ సెప్టెంబర్ 17 నాటికి ప్రధాని నరేంద్ర మోడీ 71వ పడిలోకి చేరుకున్నారు.
మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ భారీ కార్యక్రమాలను చేపట్టింది. సేవా ఔర్ సమర్పణ్ ప్రచారం, కోవిడ్ 19 వ్యాక్సినేషన్ డ్రైవర్, శానిటేషన్ డ్రైవ్, బ్లడ్ డొనేషన్ క్యాంపుల నిర్వహణ లాంటి కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా నిర్వహించింది. ఇది ఇలావుండగా, భారత్ ఒకే రోజులో 2.5 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు వేయడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం శుక్రవారంనాడు సెకనుకుగా 466 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడం విశేషం. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఒక్కరోజులో 2 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినందుకు ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలోని డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి లడ్డూలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Thank you all Health Workers.
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 17, 2021
Well Done India! 😊 pic.twitter.com/l7K7R9ZEtm
ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల తరపున ఆరోగ్య కార్యకర్తలు బహుమతి అందజేశారు. ఆయన పుట్టిన రోజు పురస్కరించుకుని 2 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించడంలో సరికొత్త రికార్డు సృష్టించారు అంటూ మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
కాగా, దేశంలో కోటి డోసుల వ్యాక్సినేషన్ ఒక్క రోజులో తొలిసారి వేసింది ఆగస్టు 27న, ఆ తర్వాత మరో రెండు సార్లు ఈ రికార్డును భారత్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పటి వరకు హయ్యెస్ట్ సింగిల్ డే రికార్డు కోటి 30 లక్షల వ్యాక్సిన్ డోసులు.. ఈ రికార్డును సృష్టించింది ఆగస్టు 31న. శుక్రవారం ఉదయం వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలయ్యే సమయానికి దేశవ్యాప్తంగా సుమారు 77 కోట్ల డోసుల కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. సాయంత్రానికి 79 కోట్లు దాటింది.
భారత్లో తొలి 10 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేయడానికి 85 రోజుల సమయం పట్టింది. అయితే ఆ తర్వాత 45 రోజుల్లోనే 20 కోట్ల మార్క్ దాటేశాం. మరో 29 రోజుల్లో 30 కోట్ల డోసులు వ్యాక్సినేషన్ పూర్తయింది. అక్కడి నుంచి 40 కోట్లకు చేరుకోవడానికి 24 రోజులు పడితే, మరో 20 రోజుల్లో ఆగస్టు 6 నాటికి 50 కోట్ల మార్కును మన దేశం చేరుకుంది. మరో 19 రోజుల్లో 60 కోట్ల మార్క్కు, ఆ తర్వాత కేవలం 13 రోజుల్లోనే సెప్టెంబర్ 7 నాటికి 70 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేయడం పూర్తవడం విశేషం.
Recommended Video
మరోవైపు, భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 34,403 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 12.5 శాతం ఎక్కువ. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 3,33,47,325గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి కారణంగా 320 మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 4.4 లక్షల మందికి పైగా కరోనా కారణంగా మరణించినట్లుగా తెలుస్తుంది. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 3,39,056 గా ఉన్నాయి. ఇది 1.02 శాతం గా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 37,950 మంది కరోనా మహమ్మారి బారినుండి రికవర్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తంగా కరోనా మహమ్మారి బారినుండి 3.25 కోట్ల మంది కోలుకున్నారు. కేరళ నాలుగు రోజులలో మొదటిసారిగా 20,000 కంటే ఎక్కువ తాజా కోవిడ్ -19 కేసులను నివేదించింది, ఇది భారతదేశ రోజువారీ సంఖ్యను ఆరు రోజుల గరిష్ట స్థాయికి నిన్న 35,000 దగ్గరకు తీసుకెళ్లింది. కేరళ ఒక్క రాష్ట్రంలో మాత్రమే లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, మహారాష్ట్రలో 50,000 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.