బీజేపీ ఓటమిపై ప్రధాని మోదీ రియాక్షన్ -ఆ రాష్ట్రాలకు కేంద్రం భరోసా -మమత, విజయన్, స్టాలిన్కు విషెస్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో మినీ సంగ్రామం ముగిసినట్లయింది. రెండేళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలొచ్చాయి. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకున్న కాషాయదళం కొత్తగా పుదుచ్చేరిలో ఎన్డీఏ మిత్రులతో కలిసి సర్కారు ఏర్పాటు చేయనుంది. బీజేపీతో పొత్తుపెట్టుకున్న అన్నాడీఎంకే తమిళనాట పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా పోటీ ఇవ్వగలిగింది. కేరళలో బీజేపీకి ఉన్న ఒక్కసీటూ పోయింది. కాగా, ప్రతిష్టాత్మక బెంగాల్ ఎన్నికల్లోబీజేపీ టెక్నికల్ గా లాభయపడ్డా, సెంటిమెంట్ పరంగా చావుదెబ్బను చవిచూసింది. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య రియాక్షన్స్ వెలిబుచ్చారు..
బెంగాల్లో బీజేపీ నిలిచింది..
''పశ్చిమ బెంగాల్ లో ఒకప్పుడు ఉందా, లేదా అన్నట్లుండే బీజేపీ ఇప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో గెలిచి నిలిచింది. పార్టీకి ఓట్లేసిన బెంగాలీ సోదరసోదరీమణులందరికీ ధన్యవాదాలు. బీజేపీ తన శక్తికొద్దీ బెంగాలీలకు సేవ కొనసాగిస్తుంది. చక్కటి స్ఫూర్తితో పోరాడిన కార్యకర్తలందరినీ అభినందిస్తున్నా. ఇక ఎన్నికల్లో గెలుపొందిన దీదీకి, ఆమె నాయకత్వంలోని టీఎంసీ పార్టీకి అభినందనలు. బెంగాలీల కలలు నిజమయ్యేలా మమత సర్కారుకు కేంద్రం తన వంతుగా సహాయసహకారాలు కొనసాగిస్తుంది. కరోనాపై పోరులోనూ అండగా నిలుస్తాం'' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇక
కేరళలో ఒక్క సీటు రాకున్నా
ఉన్న స్థానాన్ని కోల్పోయి, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సున్నాకు పరిమితమైంది. అయితే, విసృతమైన అంశాల్లో కేరళతో కలిసికట్టుగా కేంద్రం పనిచేస్తుంది ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ''ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన కేరళ ప్రజలకు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రజలకు బీజేపీ సేవలు కొనసాగుతాయి. పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసిన కార్యకర్తల కృషిని అభినందిస్తున్నాను. ఎన్నికల్లో విజయం సాధించిన పినరయి విజయన్, ఆయన నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమికి నా అభినందనలు'' అని మోదీ పేర్కొన్నారు.
తమిళ కల్చర్కు ప్రాచుర్యం
తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ జోడి తుడిచిపెట్టుకుపోతుందన్న విశ్లేషణకు విరుద్ధంగా ఆ రెండు పార్టీలు 73 స్థానాలు సాధించి పర్వాలేదనిపించాయి. ఎన్డీఏకు మద్దతిచ్చిన తమిళ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు సంక్షేమం కోసం, అద్భుతమైన తమిళ సంస్కృతికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు బీజేపీ పాటుపడుతుందని మోదీ చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎంకే స్టాలిన్ కు అభినందనలు తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో, COVID-19 మహమ్మారిని ఓడించడంలో తమిళనాడుకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు. అస్సాంలో రెండోసారి బీజేపీని గెలిపించినందుకూ ఆయన ధన్యవాదాలు చెప్పారు.