ఆ ఒక్కటీ అడక్కు..! బీజేపీ దూతగా నితిన్ గడ్కరీ: శివసేనకు బుజ్జగింపులు
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము ముందుకు రావట్లేదని, ప్రతిపక్షంలోనే కూర్చుంటామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ముంబై వేదికగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇక అధికారాన్ని అందుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతాపార్టీ, దాని మిత్రపక్షం శివసేనలపైనే పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా? అనే విషయాన్ని తేల్చుకోవాల్సిన బాధ్యత శివసేనపైనే పడింది. రాజకీయ సంక్షోభాన్ని గానీ, రాష్ట్రపతి పాలన నుంచి గానీ బయట పడాలీ అంటే శివసేన తీసుకునే కీలక నిర్ణయం మీదే ఆధార పడి ఉంది.

బీజేపీ దూతగా రంగంలో దిగిన నితిన్ గడ్కరీ..
ఈ పరిస్థితుల్లో శివసేనను బుజ్జగించడానికి బీజేపీ రంగంలోకి దిగింది. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ లతో స్నేహ సంబంధాలు ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని దూతగా పంపించింది. మధ్యవర్తిత్వాన్ని నెరపాలని ఆదేశించింది. అధిష్ఠానం ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆయన న్యూఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్నారు. శివసేనతో సంప్రదింపులు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. శివసేన అంగీకరిస్తూ సంకేతాలను పంపిస్తే.. ఈ రాత్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల మార్గాలను అన్వేషిస్తానని గడ్కరీ వెల్లడించారు.

ఆ ఒక్కటీ తప్ప..
శివసేనతో ఎలాంటి చర్చలకైనా, ఎలాంటి డిమాండ్లకైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. 50-50 ఫార్ములాను మినహాయించి, ఎలాంటి ప్రతిపాదనలు గానీ, డిమాండ్లు గానీ శివసేన తమ ముందు ఉంచినా.. దానికి అంగీకరించే ప్రయత్నం చేస్తామని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల పాటు పంచుకోవాలనే ఒక్క డిమాండ్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని గడ్కరీ కుండబద్దలు కొట్టారు. అయిదేళ్ల పాటు తమ పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తేటతెల్లం చేశారు.

శివసేన పరిస్థితేంటీ..
మరోవంక- శివసేన మాత్రం తెగే దాకా లాగుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిప్పులు కురిపించింది. కుట్ర రాజకీయాలకు తెర తీస్తోందంటూ బీజేపీపై ఆరోపణలను గుప్పించింది. 50-50 ఫార్ములాపై తప్ప ప్రత్యామ్నాయంగా మరో అంశాన్ని చర్చించేది లేదని పునరుద్ఘాటించింది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ తాము ఇదే ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచామని, దాన్ని అంగీకరిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తామని ఉద్ధవ్ థాక్రే గానీ, సంజయ్ రౌత్ గానీ పలుమార్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడానికి బీజేపీకి ఉన్న ఇబ్బందులేమిటని నిలదీస్తోంది. రాష్ట్రపతి పాలనకైనా సిద్ధపడేలా కనిపిస్తోంది ఆ పార్టీ వైఖరి.












Click it and Unblock the Notifications