కాంగ్రెస్కు హైఓల్టేజ్ షాక్: ప్రియాంకా గాంధీ అలర్ట్: భర్తకు: కొద్దిరోజుల పాటు ప్రచారానికి దూరం
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోన్న వేళ.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న దశలో.. కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కొద్దిరోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉంటున్నారు. దీని ఫలితంగా- ప్రియాంకా గాంధీ కూడా కొద్దిరోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్లో ఉండాలని నిర్ణయించుకున్నారు.
గంగానదిలో ప్రియాంకా గాంధీ పుణ్యస్నానం..నుదుట తిలకం: పూలు కురిపించిన యోగి సర్కార్
కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాంలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అస్సాంలో మూడు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. అస్సాం, బెంగాల్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. ఈ నెల 6వ తేదీన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకేదశలో ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంకో రెండు రోజుల్లో ఈ మూడు చోట్ల ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ప్రచారం ముగియడానికి ఎక్కువ సమయం లేనందున అన్ని పార్టీలు కూడా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో స్టార్ క్యాంపెయినర్ ప్రియాంకా గాంధీ వాద్రా సేవలను కోల్పోనుందని అంటున్నారు. రాబర్ట్ వాద్రాకు కరోనా వైరస్ సోకడం వల్ల ఆయన భార్య ప్రియాంకా గాంధీ ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్లారు. ఫలితంగా- ఎన్నికల ప్రచారానికి దూరమైనట్టేనని అంటున్నారు. కాగా- ప్రియాంకా గాంధీకి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ- కొద్దికాలం పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ డాక్టర్లు సూచించిన సలహా మేరకు ఆమె తన ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
हाल में कोरोना संक्रमण के संपर्क में आने के चलते मुझे अपना असम दौरा रद्द करना पड़ रहा है। मेरी कल की रिपोर्ट नेगेटिव आई है मगर डॉक्टरों की सलाह पर मैं अगले कुछ दिनों तक आइसोलेशन में रहूँगी। इस असुविधा के लिए मैं आप सभी से क्षमाप्रार्थी हूँ। मैं कांग्रेस विजय की प्रार्थना करती हूँ pic.twitter.com/B1PlDyR8rc
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021
ప్రస్తుతం ఆమె శుక్ర, శని, ఆదివారాల్లో వరుసగా అస్సాం, తమిళనాడు, కేరళల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. రోడ్ షోలు, బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. దురదృష్టవశావత్తూ తాను ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. పోలింగ్ గడువు సమీపించినందున ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పార్టీ క్యాడర్కు సూచించారు. అన్ని షెడ్యూళ్లను యధాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.