సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక: భారత్ ఆశ్రయం కోరుతూ తమిళనాడు చేరుకున్న లంకేయులు
న్యూఢిల్లీ: శ్రీలంక సంక్షోభం రోజు రోజుకూ తీవ్రస్థాయికి చేరుకుంటోంది. నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుండటంతో సామాన్యుల ఆహారం కోసం ఆర్థనాదాలు చేస్తున్నారు. తినడానికి తిండి కూడా దొరక్కపోవడంతో భారతదేశంలోకి వలస వస్తున్నారు. ఇప్పటికే పలు కుటుంబాలు తమిళనాడుకు చేరుకోగా.. తాజాగా మరో 19 మంది శ్రీలంక తమిళులు పడవలో తమిళనాడులోని ధనుష్కోడికి చేరుకున్నారు.
భారత్ చేరుకున్న 39 మంది లంకేయులు
ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో జీవించడం చాలా కష్టంగా మారిందని తమిళనాడు చేరుకున్న శ్రీలంక వాసులు చెబుతుండటం గమనార్హం. కాగా, ఇప్పటి వరకు మహిళలు, చిన్నారులు సహా మొత్తం 39 మంది శ్రీలంక నుంచి వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక.. ప్రపంచ దేశాల సాయం కోరుతోంది. ఇప్పటికే భారత్ శ్రీలంకకు భారీ సాయాన్ని అందించింది.
భారీ ఎత్తున శ్రీలంకకు భారత్ సాయం
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడుతున్న శ్రీలంకకు భారత తన వంతు సాయం అందిస్తోంది. భారత్ నుంచి ఇంధన కొనుగోళ్లకు 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ను ప్రకటించింది. నిత్యావసరాలు, ఔషధాల దిగుమతికి కూడా భారత్ మరో 1 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ను ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇప్పటి వరకు లంకకు 2.7 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా పలు రకాల ఇంధనాలను సరఫరా చేసింది. తెలుగు రాష్ట్రాలు కూడా ఆహార పదార్థాలను ఎగుమతి చేస్తున్నాయి. శ్రీలంకలో తమిళులను దృష్టిలో పెట్టుకుని తమవంతుగా సాయం చేసేందుకు సిద్ధమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
సంక్షోభం నుంచి శ్రీలంక గట్టెక్కాలంటే..
సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే వచ్చే ఆరు నెలల్లో 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కావాలని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సర్బీ ఇప్పటికే వెల్లడించారు. 3 బిలియన్ డాలర్ల సాయం అందితే ఇంధనం, ఔషధాల వంటి అత్యవసర వస్తువులను సరఫరా చేయగలమన్నారు.
కాగా, జేపీ మోర్గాన్ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది శ్రీలంక స్థూల అప్పులు 7 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముంది. ఇక ద్రవ్యలోటు కూడా 3 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి శ్రీలంక విదేశీ మారక నిల్వలు 1.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.