సంచలన నిర్ణయం: జయలలిత, శశికళకు చెందిన 128 ఆస్తులు సీజ్: బినామీ పేర్లతో !
అక్రమాస్తుల కేసుకు సంబంధించి జయలలితతో పాటు శశికళ, ఆమె వదిన ఇళవరసి, జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ ఆస్తులు జప్తు చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు జప్తు చెయ్యడానికి తమిళనాడు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. అక్రమాస్తుల కేసులో జయలలిత ఆస్తులు జప్తు చేసి వాటి విలువ లెక్కించి ఆస్తులు వేలం వెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
షాక్: రజనీకాంత్ కొత్త స్కెచ్: సీఎం అభ్యర్థిగా'మోనార్క్':జయ, కరుణనే ఢీ కొట్టిన ఐఏఎస్ !
అక్రమాస్తుల కేసుకు సంబంధించి జయలలితతో పాటు శశికళ, ఆమె వదిన ఇళవరసి, జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ ఆస్తులు జప్తు చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం జయలలిత ఆస్తులు గుర్తించే పనిలో నిమగ్నం అయ్యింది.
జయలలిత పేరుతో 68 ఆస్తులు !
జయలలిత పేరుతో 68 ఆస్తులు ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది. అంతే కాకుండా జయలలిత పేరుతో ఆరు సంస్థలు రిజిస్టర్ అయ్యాయని అధికారులు గుర్తించారు. జయలలిత పేరుతో ఇంకా ఎమైనా ఆస్తులు ఉన్నాయా ? అంటూ ఆరా తీస్తున్నారు.
శశికళకు భారీ షాక్ !
అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ ఆస్తులు జప్తు చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం అధికారులకు సూచించింది. శశికళకు చెందిన ఆస్తులు జప్తు చేసి వాటిని వేలం వేసి కోర్టులో అపరాద రుసుం చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇళవరసి, సుధాకరన్ ఆస్తులు ఎక్కడ ?
శశికళ సోదరుడు జయరామన్ భార్య ఇళవరసి, జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇళవరసి జాజ్ సినిమాస్ సీఈవో వివేక్ సొంత తల్లి అనే విషయం తెలిసిందే. ఇళవరసి, సుధాకరన్ పేరుతో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ? అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు.
రంగంలోకి ఆరు మంది కలెక్టర్లు !
జయలలిత పేరుతో ఉన్న ఆస్తులు గుర్తించడానికి ఆరు మంది కలెక్టర్లు రంగంలోకి దిగారు. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో అమ్మ జయలలిత పేరుతో రిజిస్టర్ అయిన ఆస్తులు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
జయలలిత పేరుతో ఆరు సంస్థలు ?
చెన్నైలోని పోయెస్ గార్డెన్, సిరువత్తూరు బంగ్లా, కోడనాడు ఎస్టేట్, హైదరాబాద్ లోని ద్రాక్షతోట తదితర ఆస్తులు జయలలిత పేరు మీద రిజిస్టర్ అయ్యాయి. అంతే కాకుండా జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ ల పేర్లతో ఆరు సంస్థలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. వాటి పూర్తి వివరాలు సేకరించి ఆ ఆస్తుల విలువ ఎంత ? అనే విషయంపై నివేదిక తయారు చెయ్యాలని అధికారులు సిద్దం అయ్యారు.
మొత్తం బినామీలేనా ?
శశికళ, ఇళవరసి, సుధాకరన్ కు చెందిన ఆస్తులు చాల వరకు బినామీ పేర్లతో ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే వారి పేర్లతో ఉన్న ఆస్తులు గుర్తించిన తరువాత బినామీ ఆస్తుల మీద దృష్టిసారించాలని అధికారులు నిర్ణయించారని సమాచారం.
మొత్తం రూ. 130 కోట్లు
అక్రమాస్తుల కేసులో జయలలితకు రూ. 100 కోట్లు, శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు రూ. 30 కోట్లు (ఒక్కోక్కరికి రూ. 10 కోట్లు) అపరాద రుసుం విదిస్తూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇదే కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు నాలుగేళ్లు జైలు శిక్షకు గురై బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
జయలలిత పూర్తి ఆస్తులు గుర్తించాలి !
జయలలితకు చెందిన పూర్తి ఆస్తులు గుర్తించి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వాటి విలువ లెక్కించి నివేదిక సిద్దం చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తరువాత రూ. 100 కోట్ల విలువైన ఆస్తులు వేలం వేసి కోర్టులో అపరాద రుసుం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.
దీపక్ దగ్గర వీలునామా ? దీపా వస్తారా !
జయలలిత ఆస్తులు నాకు, నా సోదరి దీపాకు మాత్రమే చెందుతాయని, మా మేనత్త రాసిన వీలునామా నాదగ్గరే ఉందని ఆమే మేనల్లుడు దీపక్ ఇటీవల ప్రకటించారు. అవసరం అయితే కోర్టు విధించిన రూ. 100 కోట్ల అపరాద రుసుం చెల్లించడానికి తాను సిద్దంగా ఉన్నానని ఇదే సంవత్సరం మార్చి నెలలో దీపక్ ప్రకటించారు. ఇప్పుడు అపరాద రుసుం చెల్లించి జయలలిత ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి దీపక్, దీపా ముందు వస్తారా ? అనే విషయం వేచి చూడాలి.