కాల్పుల కలకలం: పరుగులు తీసిన అస్సాం ఎమ్మెల్యే, భద్రతాధికారులు
గౌహతి: అస్సాం-నాగాలాండ్ రాష్ట్రాల సరిహద్దుల మధ్య కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జోర్హాట్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరగడంతో అటుగా వెళ్లిన ఓ అస్సాం కాంగ్రెస్ ఎమ్మెల్యే, అతని భద్రతాధికారులు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
నాగాలాండ్ రాష్ట్రం వైపు నుంచి కాల్పులు జరిగినట్లు తెలుస్తోందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాగా, ఈ కాల్పుల్లు ముగ్గురు గాయాలపాలయ్యారని చెప్పారు. మరియాని ఎమ్మెల్యే రూప్జ్యోతి కుర్మి, తన వ్యక్తిగత భద్రత అధికారులు, ఇతరులు దేసో వ్యాలీ రిజర్వ ఫారెస్టులో దురాక్రమణలు తెలుసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలోనే నాగాలాండ్ వైపు నుంచి కాల్పులు జరిగాయి. దీంతో అక్కడ్నుంచి వీరంతా పరుగులు పెట్టి తప్పించుకున్నారు.
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. వెంటనే అక్కడి పరిస్థితులపై పరిశీలించాలని సీనియర్ పోలీసు అధికారి జీపీ సింగ్ను ఆదేశించారు. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. కాగా, అస్సాంలోని చారిడియో, శివసాగర్, జోర్హాట్, గోలఘాట్, కర్బి అంగ్లాంగ్ జిల్లాలు నాగాలాండ్తో సరిహద్దును కలిగివున్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. నాగాలాండ్ వైపు నుంచి దురాక్రమణలు చోటు చేసుకుంటుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.
Recommended Video
దురాక్రమణలను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో తమపై కొందరు కాల్పులకు తెగబడ్డారని ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి తెలిపారు. అదృష్టవశాత్తు తామంతా కాల్పుల నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు అస్సాం ప్రభుత్వం నాగాలాండ్ సర్కారుతో మాట్లాడటం లేదని ఆయన ఆరోపించారు.