కబాలి డాన్ బర్త్ డే పార్టీ, కైమాకత్తి, ఎస్కేప్, ఎన్ కౌంటర్ చేస్తారని, చివరికి ఏం చేశాడంటే!
చెన్నై: అనేక క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉంటూ కబాలి సినిమా స్ట్రైల్ లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి పోలీసుల దాడి చేసిన సమయంలో చాకచక్యంగా తప్పించుకుని పారిపోయిన చెన్నై డాన్ బిను మంగళవారం స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాడు. ఎన్ కౌంటర్ చేస్తారనే భయంతో బిను పోలీసు అధికారుల ముందు లొంగిపోయి విచారణకు సహకరిస్తానని కాళ్లమీద పడిపోయాడు.
Recommended Video
రౌడీషీటర్లకు డాన్
చెన్నై నగరంలో పేరుమోసిన రౌడీషీటర్లకు బిను డాన్ గా వ్యవహరిస్తున్నాడు. బిను కనుసైగల్లోనే చెన్నై నగరంలో హత్యలు, కిడ్నాప్ లు, దోపిడీలు, రాబరీలు, స్మగ్లింగ్ తదితర క్రిమినల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రౌడీసామ్రాజ్యానికి బిను డాన్ గా అవతారమెత్తాడు.
మూడు జిల్లాల రౌడీలు
వారం రోజుల క్రితం బిను పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. చెన్నై నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డులోని ఫాం హౌస్ లో ఉన్న లారీ షెడ్ దగ్గర జరిగిన బిను పుట్టిన రోజు వేడుకలకు చెన్నై నగరంతో సహ కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలకు చెందిన దాదాపు 130 మంది రౌడీషీటర్లు హాజరైనారు.
మందు విందు చిందు
బిను పుట్టిన రోజు సందర్బంగా ఫాంహౌస్ లో దాదాపు 40 గొర్రెలు బలి ఇచ్చి బిరియాని, కబాబ్ చేయించారు. భారీ మొత్తంలో మద్యం తరలించి రౌడీలకు పంచిపెట్టారు. మటన్ షాప్ లో మాంసం కైమా చేసే కత్తితో బిను కేక్ కత్తిరించి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని మందు విందు పూర్తి చేసి చిందులు వేశారు.
పోటీగా ఇద్దరు రౌడీలు
తనకు పోటీగా చెన్నై నగరంలో ఎదుగుతున్న రౌడీషీటర్లు రాధాక్రిష్ణన్, సెంథిల్ అనే ఇద్దరిని పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించిన బిను తన అనుచరులతో కలిసి అక్కడే హత్య చెయ్యాలని ప్లాన్ వేశాడు. అయితే రాధాక్రిష్ణన్, సెంథిల్ కు అనుమానం వచ్చి బర్త్ డే పార్టీకి వెళ్లకపోవడంతో వారి ప్రాణాలు మిగిలాయని పోలీసులు అంటున్నారు.
చెన్నై పోలీసు దెబ్బ
బిను పుట్టిన రోజు వేడుకల సమాచారం తెలుసుకున్న పోలీసులు అర్దరాత్రి ఫామ్ హౌస్ చుట్టుముట్టారు. ఆ సమయంలో బిను చాకచక్యంగా తప్పించుకున్నాడు. తుపాకులు గురి పెట్టిన పోలీసులు 72 మంది రౌడీలను అరెస్టు చేశారు. రౌడీల నుంచి భారీ మొత్తంలో మారణాయుధాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్ కౌంటర్
తప్పించుకున్న బినుకోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో గాలించారు. బిను ఎదురుతిరిగితే ఎన్ కౌంటర్ చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది. ఎన్ కౌంటర్ చేస్తారనే భయంతో మంగళవారం బిను పోలీసుల ముందు లొంగిపోయాడు.
కోర్టుకు డాన్ బిను
మంగళవారం చెన్నైలోని అంబత్తూరు పోలీస్ స్టేషన్ చేరుకున్న డాన్ బిను డీసీపీ సర్వేష్ రాజ్ ముందు లొంగిపోయాడు. బినును కోర్టులో హాజరుపరిచి విచారణ చెయ్యడానికి కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తికి మనవి చేస్తామని, కోర్టు అనుమతించకపోతే అతన్ని రిమాండ్ కు తరలిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.