తాలిబాన్ల కాల్పులు: పలువురు మృతి.. ఎందుకంటే
ఆప్ఘనిస్తాన్లో తాలిబాన్ల ఆగడాలు కంటిన్యూ అవుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీలో నిరసన చేశారు. జాతీయ పతాకంతో ఆందోళన చేయగా.. వారిపై తాలిబన్లు కాల్పులు జరిపారు. దీంతో పలువురు మృతి చెందారు. అసాదాబాద్ నగరంలో ఈ ఘటన జరిగింది. బుధవారం జలాలాబాద్లోనూ జాతీయ జెండా విషయంలో నిరసన తెలపగా.. తాలిబన్ల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు వారి జెండాలను చించేస్తూ.. ఆఫ్ఘన్ జెండాలను ప్రదర్శిస్తున్నారు.
Recommended Video
గురువారం కూడా అసాదాబాద్లో తాలిబన్లకు వ్యతిరేకంగా జాతీయ జెండాలతో నిరసన తెలుపుతున్న సమయంలో తాలిబన్లు ఫైరింగ్ జరిపారు. అదే సమయంలో తొక్కిసలాట జరిగింది. దీంతో మరణాలు ఫైరింగ్ వల్ల జరిగాయా లేక తొక్కిసలాట వల్ల అనే విషయం తెలియదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అసాదాబాద్లో వందల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపినట్లు ఆ వ్యక్తి చెప్పారు.
ఇటు ఆప్ఘానిస్తాన్ ప్రజలు బోరుమని విలపిస్తున్నారు. తమను కాపాడాలంటూ యూకే, యూఎస్ బలగాలను వేడుకుంటున్నారు. కనీసం తమ పిల్లలనైనా తీసుకెళ్లాంటూ ప్రాధేయపడుతున్నారు. ఆఫ్ఘాన్ వాసుల్లో కొందరు తల్లులైతే ఏకంగా తమ పిల్లలను ఇనుప కంచె నుంచి అవతల వైపునకు విసిరేస్తున్నారు. విదేశీ బలగాలను పట్టుకోమని వేడుకుంటున్నారు. కొందరు చిన్నారులు కంచెలో చిక్కుకుని గాయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషాదకర దృశ్యాలను చూసి తాను చలించిపోయినట్టు బ్రిటీష్ అధికారి ఒకరు తెలిపారు.
తాలిబాన్లు ఆక్రమించారో లేదో.. వారి ఆక్రమణలు, అరాచకాలు కొనసాగుతున్నాయి. కాల్పులు, దాడులకు తెగబడుతున్నారు. దీంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా అక్కడే ఉన్నారు. తమ వారిని స్వదేశం తీసుకొచ్చే సాయం చేయాలని కోరారు.