కర్నూలు మెడికల్ కాలేజీ వంట మనిషికి కరోనా .. టెన్షన్ లో వైద్యులు , వైద్య విద్యార్థులు
కర్నూలు జిల్లాలో కరోనా ప్రతాపం చూపిస్తుంది . అక్కడ అధికార యంత్రాంగం లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేసినా సరే కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గటం లేదు . ఇక ఇప్పటి వరకు 411 కేసులు కర్నూలులోనే నమోదు అయ్యాయి. ఏపీలోనే అత్యధికంగా కర్నూలులో కేసులు నమోదు అవుతున్న పరిస్థితి . ఇక వీరిలో 335 కేసులు బాగా యాక్టివ్ గా వైరస్ ఉంది. ఇప్పటివరకు 66 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 110 మంది మృత్యువాత పడ్డారు . రోజు రోజుకూ కేసులు నమోదు కావటం , అటు వైద్యులు కూడా కరోనా బారిన పడుతుండటంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
ఇక ఇదే క్రమంలో తాజాగా కర్నూలు మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది .గత 24 గంటల్లో కర్నూలులోనే కొత్తగా 25 కేసులు నమోదు కాగా.. ఒకరు మృతిచెందారు. ఇక, ఏపీలో అత్యధికంగా 411 కేసులతో కర్నూలు నో మూవ్ మెంట్ జోన్ లో ఉంది . లాక్డౌన్ కొనసాగుతున్నా, రెడ్జోన్లలో కఠిన చర్యలకు దిగినా సరే కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా, కర్నూలు మెడికల్ కాలేజీలో వంట మనిషికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మెడికల్ కాలేజీలో కలకలం మొదలైంది.
మెడికల్ కాలేజీ విద్యార్థులకు వంట చేసి పెట్టే హాస్టల్లో పనిచేసే వంటమనిషికి కరోనా పాజిటివ్గా రావడంతో అక్కడ నిత్యం భోజనం చేస్తున్న పీజీ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మెడికల్ కాలేజీ వంటమనిషికి పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు హాస్టల్ను ఖాళీ చేయించి పూర్తిగా శానిటైజ్ చేయించి ప్రస్తుతానికి మూసివేశారు.
ఇక ఇదే సమయంలో ఇప్పటికే జీజీహెచ్లో ముగ్గురు వైద్యులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక ఇక్కడ పని చేసే వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు కూడా కరోనా భయంతో ఇబ్బంది పడుతున్నారు . ఇక తాజాగా ఇప్పుడు వంటమనిషికి కరోనా సోవడంతో ఆమె ద్వారా ఎంత మంది విద్యార్థులకు కరోనా సోకిందో అన్న ఆందోళన విద్యార్థుల్లో మొదలైంది.