సీరియళ్లు చూసి దొంగతనాలు చేశా: పని మనిషే ప్రధాన నిందితురాలు
హైదరాబాద్: నగరంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలను గమనించినట్లయితే సినిమాలు, సీరియళ్ల ప్రభావం వ్యక్తులపై ఎంత ఉందో తెలుస్తోంది. అయితే, వీటిలో చూపించే మంచి కంటే చెడునే ఆదర్శంగా తీసుకుంటుండటం ఆందోళన అంశంగా మారింది. ఇటీవల జరిగిన రెండు ఘటనలు పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది.
ఇటీవల గుర్తు తెలియని దుండగులు ఇంట్లోంచి ప్రవేశించి ఒంటరిగా ఉన్న పనిమనిషిపై మత్తుమందు చల్లి బంగారు ఆభరణాలు అపహరించారంటూ ఓ వ్యాపారి నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు. కాగా, పనిమనిషి సెల్ఫోన్లోని కాల్స్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటేంటే.. ఈ దొంగతనానికి కథా, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా పని మనిషే.
దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి కథనం ప్రకారం.. హైదర్గూడలోని అనికత్ రెసిడెన్సీలో సత్యనారాయణ అనే వ్యాపారి ఉంటున్నారు. తొమ్మిది నెలల క్రితం పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన శ్రీలక్ష్మి ఆయన ఇంట్లో పనికి కుదిరింది.
ఆమె ఉండటానికి గది కూడా ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం సత్యనారాయణ దంపతులు పనిమీద బయటకు వెళ్లారు. సాయంత్రం వచ్చేసరికి పనిమనిషి శ్రీలక్ష్మి అపస్మారక స్థితిలో పడిఉండటంతో కంగారుపడి ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఆమె కోలుకొని సాయంత్రం ఐదు గంటల తరువాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చారని, తనపై మత్తుమందుజల్లారని, తర్వాత ఏం జరిగిందో తెలియదంటూ బుకాయించింది. అన్ని కోణాల్లో విచారణ మొదలుపెట్టిన పోలీసులు ఆమె సెల్ఫోన్ డేటాను తెప్పించారు.
అదుపులోకి తీసుకొని విచారించగా తాను టీవీ సీరియళ్లు బాగా చూస్తానని, అందులోని ఒక సన్నివేశాన్ని దొంగతనానికి వాడుకున్నట్లుగా నిందితురాలు చెప్పింది. డాబాపై గదిలో ఉంచిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కాగా, మరో ఘటన గమనిస్తే.. ఇటీవల ఓ ముగ్గురు యువకులు ఓ బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అభయ్ అనే బాలుడ్ని కిడ్నాప్ చేసి, అతని తల్లిదండ్రులను రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు. అయితే అప్పటికే అభయ్ని హత్య చేసి ఓ అట్టపెట్టెలో ఉంచారు. అభయ్ హత్యను సవాల్ గా తీసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఓ సినిమాను చూసి ఈ నేరానికి పాల్పడినట్లు నిందిత యువకులు చెప్పడం గమనార్హం.